హర్షసాయి కేసులో రోజుకో కోణం వెలుగు చూస్తోంది. తాజాగా బాధితురాలి తరఫు లాయర్ నాగూర్ బాబు, ప్రొడ్యూసర్ బాలచంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో హర్షసాయి కేసుకు సంబంధించిన వివరాలు, బాధితురాలి తరఫు వాదనలు మొత్తం వారు వివరించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. హర్షసాయి వల్ల బాధితురాలు చాలా ఇబ్బంది పడింది. కానీ ఇప్పటి వరకు హర్షసాయిపై పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ ఐఆర్ ను బయట పెట్టలేదు. చాలా మంది బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితురాలు ఏదో రూ.2కోట్ల కోసం హర్షసాయిపై కేసు పెట్టిందని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. మీడియా వాళ్లు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కానీ బాధితురాలి ఆవేదనను అందరూ అర్థం చేసుకోవాలని వారు కోరుతున్నారు. హర్షసాయి ప్రస్తుతం దేశం విడిచిపారిపోయాడు. ఆయనకు సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో బాధితురాలిని అవమానించే విధంగా వీడియోలు, ఆడియో వాయిస్ లను రిలీజ్ చేస్తున్నారు. నిజా నిజాలు తెలియకుండా బాధితురాలని ఇబ్బంది పెడుతున్న దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ మీద కేసులు నమోదు చేసినట్టు వారు వివరించారు.
బాధితురాలు అంత పెద్ద సెలబ్రిటీ అయిన హర్షసాయిపై ధైర్యంగా కేసు పెట్టింది. అయితే కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్షసాయి తన సిబ్బందితో కలిసి ఇబ్బందులు పెడుతున్నాడు. పూర్తి విచారణ జరిగి నిజానిజాలు తెలిసే వరకు మెయిన్ మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ ను రిలీజ్ చేయొద్దని ఇప్పటికే కోర్టు ఆర్డర్ వేసింది. దాన్ని గుర్తుంచుకుని బాధితురాలికి అందరూ అండగా నిలబడాలంటూ వీరిద్దరూ కోరారు.