నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో రూపొందిన “గుర్రం పాపిరెడ్డి” ఈ నెల 19న థియేటర్లకు రానుంది. డార్క్ కామెడీ జానర్లో, కొత్త కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా గురించి దర్శకుడు మురళీ మనోహర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మురళీ మనోహర్ మాట్లాడుతూ — చిన్నప్పటి నుంచి శివ, నాయకుడు వంటి సినిమాలు తనను ప్రభావితం చేశాయని, ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత లండన్కు వెళ్లి అక్కడి ఫిలిం ఇనిస్టిట్యూట్లో కోర్సు చేసి వార్నర్ బ్రదర్స్ సంస్థలో ఎనిమిదేళ్లు పనిచేశానని తెలిపారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి సంపత్ నందితో పనిచేసిన అనుభవం మంచి పునాది అయ్యిందన్నారు. తన ఫస్ట్ మూవీ సింబా విడుదల ఆలస్యం అయినప్పటికీ, నిర్మాతలు తనపై నమ్మకం పెట్టుకుని గుర్రం పాపిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
ఈ సినిమా కథ పూర్ణ రాసిందని, తాను మిగతా రైటర్స్తో కలిసి స్క్రిప్ట్ను అభివృద్ధి చేసినట్లు మురళీ చెప్పారు. మొదట పరమపదసోపానం అనే టైటిల్ను అనుకున్నా, ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా “గుర్రం పాపిరెడ్డి”గా మార్చారని తెలిపారు. తెలివైనవారు–తెలివితక్కువవారి మధ్య జరిగే హాస్యభరిత సంఘటనలను సహజమైన కామెడీతో చూపించడం ఈ సినిమా ప్రధాన కాన్సెప్ట్ అని చెప్పారు. మనందరిలోనూ ఉండే చిన్న చిన్న స్టుపిడిటీ నుంచే మంచి వినోదం పుడుతుందని, అదే ఆర్గానిక్ కామెడీని తెరపై చూపించారని చెప్పారు.
హీరోగా కథలో పూర్తిగా కలిసిపోయే నటుడు కావాలనే నరేష్ అగస్త్యను సెలెక్ట్ చేశామని, ఆయన గుర్రం పాపిరెడ్డి పాత్రను చాలా సహజంగా పోషించారని చెప్పారు. ఫరియా అబ్దుల్లా నటన తమ సినిమా కోసం పర్ఫెక్ట్గా సరిపోయిందని, ఆమె సినిమాలో ఒక పాటను రాసి, పాడి, కొరియోగ్రఫీ కూడా చేసిన విషయం ప్రత్యేకమని తెలిపారు.
సినిమాలో వచ్చే పీసా డుమ్ డుమ్ పాట ఫిక్షనల్ వరల్డ్కు తీసుకెళ్తుందని, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ అందించిన సంగీతం కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. బ్రహ్మానందం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారని, ఆయనతోనే సినిమా మొదలై ముగుస్తుందని, ఆయన ఇంప్రోవైజేషన్ సినిమాకు ఎనలేని విలువను చేర్చిందని అన్నారు.
యోగి బాబు పాత్ర కూడా చాలా ముఖ్యమని, ఆయన డేట్స్ కోసం మూడు నెలలు వేచి చూసి షూట్ చేసినట్లు చెప్పారు. తమిళంలో కూడా రిలీజ్ చేసే అవకాశాలపై కొన్ని విచారణలు వచ్చినా, ముందు తెలుగు ప్రేక్షకులు సినిమాను ప్రేమగా స్వీకరించటం తనకు ముఖ్యమని చెప్పారు. పాన్ ఇండియా ట్రెండ్ కోసం కాకుండా, మంచి సినిమా తీయడం ఒక్కటే లక్ష్యం అని స్పష్టం చేశారు.
రెండున్నర గంటల నిడివి ఉన్నప్పటికీ, ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదని, సీన్ టు సీన్ ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్ చేస్తారని మురళీ అన్నారు. అదే రోజున అవతార్ రిలీజ్ అయినా, తెలుగు ప్రేక్షకులు తమ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై మ్యూజికల్ రొమాంటిక్ మూవీ, అలాగే హారర్ థ్రిల్లర్ చేయాలని ఉన్నట్లు తెలిపారు.
ప్రేక్షలకు కొత్తగా, సహజంగా నవ్వులు పంచే ప్రయత్నంగా గుర్రం పాపిరెడ్డి రూపొందించామని, థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు.
