అమెరికా లాంటి దేశాలతో పోల్చితే, భారతదేశంలో కరోనా ప్రభావం తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అభిప్రాయపడింది. అయితే, అది గతం. లాక్డౌన్ ప్రకటించాక, దేశంలో పరిస్థితులు అదుపులోకి వస్తాయని అంతా అంచనా వేశారు. నిన్న మొన్నటిదాకా అదే అభిప్రాయం దేశ ప్రజానీకంలో కూడా కాస్తో కూస్తో కన్పించింది. కానీ, క్రమక్రమంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అనూహ్య స్థాయిలో పెరిగిపోతోంది.
నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల కరోనా పాజిటివ్ కేసులు దేశంలో కొత్తగా నమోదయ్యాయంటే, కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి జోరు కొనసాగితే, దేశంలో ఈ రోజే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటేయొచ్చు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.
నిన్న ముంబైలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కాగా, మొత్తం మహారాష్ట్రలో దాదాపు 1500కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. తమిళనాడులోనూ కరోనా వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. నిన్న తమిళనాడులో 500కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నిన్న కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్కి పరిమితం కావడం గమనార్హం.
అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో 67 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదు కాగా, ఈ జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటేయడం గమనార్హం.
మద్యం దుకాణాల్ని తెరవడంతో దేశంలో కరనా పాజిటివ్ కేసుల సంఖ్య ముందు ముందు అనూహ్యంగా పెరుగుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 40 వేల నుంచి 50 వేలకు కరోనా కేసులు దేశంలో పెరగడం చాలా వేగంగా జరిగిన దరిమిలా, 50 వేల నుంచి లక్ష కేసులకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు.
915912 731445Yeah bookmaking this wasnt a risky decision outstanding post! . 361095