Telangana: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తెలుుగలో ప్రసంగించారు. అదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో. చాలా గొప్ప విషయమే ఇది. ఆమె తమిళనాడుకి చెందిన వ్యక్తి. ‘కొన్నాళ్ళ తర్వాత ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతాను.. తెలుగు నేర్చుకుంటాను..’ అని గతంలోనే చెప్పారామె.
వైద్యురాలు, విద్యాధికురాలు.. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో ఆమెకు అస్సలు పొసగడంలేదు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్నిటిని ఆమె ఆక్షేపిస్తున్నారు. గవర్నర్ ఆమోదం కోసం పంపిన కొన్ని దస్త్రాలు తిరిగొస్తున్నాయ్. దాంతో, తెలంగాణలో కేసీయార్ సర్కారుకీ, గవర్నర్కీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది.
తెలంగాణ రాష్ట్రం కొత్తగా సచివాలయం నిర్మించుకోగా, ఆ సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ని ఆహ్వానించలేదు తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయమై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అసహనం వ్యక్తం చేశారు కూడా.
ఇక, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తమిళి సై సందర రాజన్, ‘తెలంగాణ అభివృద్ధి అంటే హైద్రాబాద్ అభివృద్ధి మాత్రమే కాదు. అభివృద్ధి ఫలాలు తెలంగాణలోని మారు మూల పల్లెలకూ అందాలి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ అభివృద్ధి అంటే, హైద్రాబాద్తోపాటు తెలంగాణ రాష్ట్రమంతా.. అని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. మారు మూల పల్లెల్లోకీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయనీ కేసీయార్ సర్కార్ చెబుతున్న సంగతి తెలిసిందే.
మరి, గవర్నర్ తమిళి సై ఇలా ఎందుకు వ్యాఖ్యానించినట్లు.? గవర్నర్ వ్యవస్థ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఎలా.? గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా విమర్శలు చేయడాన్ని ఎలా చూడాలి.?