ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఓ రాజకీయ విశ్లేషకుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలపైనా.!
‘అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, బెయిల్ మీదున్న వ్యక్తిని అధికార పీఠమెక్కిస్తే, ఆయన హయాంలో, ఆయన పార్టీకి చెందిన నేతలు న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కోవడం వింత ఎలా అవుతుంది.?’ అన్నది సదరు రాజకీయ విశ్లేషకుడి ప్రశ్న.
‘అది ఒరిజినల్ కాదురా డాష్.. నీకు చూడాలనిపిస్తే చెప్పు.. నీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తా..’ అంటూ సాక్షాత్తూ ఓ బాధ్యతగల ప్రజా ప్రతినిథి, అందునా.. దేశ భవిష్యత్తు కోసం చట్టాలు చేసే పార్లమెంటులో సభ్యుడిగా వున్న ఓ వ్యక్తి అత్యంత జుగుప్సాకరమైన భాష ప్రయోగించాడంటే, ముమ్మాటికీ.. అది అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన ధైర్యం వల్లనే.. అని ఆ రాజకీయ విశ్లేషకుడు చెప్పుకొచ్చాడు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని తీసుకుంటే. ఆయన్ని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఆయన్నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి, గోరంట్ల మాధవ్ విషయంలో ఆ ప్రక్రియ ఎందుకు జరగలేదు.? ఎందుకంటే, రఘురామ వైసీపీకి ఎదురు తిరిగారు.. గోరంట్ల మాధవ్ వైసీపీ అధిష్టానానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా వున్నారు.. అదీ తేడా.
నేరం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు నిజాలు నిగ్గు తేల్చడం పోలీసులు అలాగే దర్యాప్తు సంస్థల విధి. విచారణ తదుపరి న్యాయస్థానాలకు నివేదిస్తే, అక్కడ తేలుతుంది ఎవరు తప్పు చేశారో.!
గోరంట్ల మాధవ్ మీద కుట్ర జరిగి వుండొచ్చని సాక్షాత్తూ హోంమంత్రి తానేటి వనిత ప్రకటించేశాక, వీడియో కాల్ ఫేక్ అని కాక.. ఎస్పీ ఫకీరప్ప ఆ వీడియోలో వున్నది గోరంట్ల మాధవ్ అని ధృవీకరిస్తారనే ఆలోచన ఎవరికైనా వస్తుందా.? ఛాన్సే లేదు. ఇక్కడే ఈ కేసు దాదాపుగా చచ్చిపోయింది.
సినీ నటుడు పృధ్వీరాజ్ మీద చర్యలు తీసుకున్నట్లుగా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ల మీద చర్యలు తీసుకోనప్పుడే, రాష్ట్రంలో వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో అర్థమయిపోయింది. సో, గోరంట్ల మాధవ్ అంత అగ్రెసివ్గా మాట్లాడటంలో ఎవరికీ వింతగా అనిపించడంలేదు. కాకపోతే, ఆయన మాటల్ని మీడియా సాక్షిగా వింటూ, జనం సిగ్గు పడుతున్నారు. తప్పదు, ఎవర్ని చట్ట సభలకు పంపిస్తున్నామనే సోయ లేకుండా ఓట్లేస్తున్నప్పుడు, ఆ జనానికి ఆ మాత్రం శిక్ష పడి తీరాల్సిందే కదా.?