సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఐటీ రంగంతో పాటు డేటా సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఎఎన్ఎస్ఆర్ సంస్థతో విశాఖలో జిసిసి ఏర్పాటు కోసం ఎంఓయూ కుదిరిందని గుర్తుచేశారు.
ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థ కూడా విశాఖలో జిసిసి ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. స్కిల్డ్ వర్క్ఫోర్స్, తక్కువ ఖర్చు, అనుకూలమైన ఎకోసిస్టమ్ కారణంగా ఏబీమ్ తమ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవల కోసం విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంచుకోవాలని ఆయన సూచించారు.
దీనిపై ఏబీమ్ కన్సల్టింగ్ ఎండి యానో టోమోకాజు మాట్లాడుతూ, తమ సంస్థ స్ట్రాటజీ, మేనేజ్మెంట్ ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ, అవుట్సోర్సింగ్ సేవలను అందిస్తున్నదని తెలిపారు. సింగపూర్, థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలలో దాదాపు 1,200 మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు.
భారత్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, SAP ఆధారిత సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టోమోకాజు స్పష్టం చేశారు.
