శంకర్ తెరకెక్కించే సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడంటే పాన్ ఇండియా.. అనే పేరు వాడుతున్నాంగానీ, శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమానే ఒకప్పుడు.!
ఇక, శంకర్ సినిమాల్లో సామాజిక బాధ్యత.. అనే అంశం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రధానంగా అవినీతి, రాజకీయాల చుట్టూ శంకర్ చాలా సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు అంచనాల్ని అందుకోకపోయి వుండొచ్చు.. కానీ, వాటిల్లోని సోషల్ మెసేజ్, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తూనే వుంటుంది.
ఇక, ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికొస్తే, సినిమాపై విపరీతమైన నెగెటివిటీని చూశాం, చూస్తూనే వున్నాం. కానీ, వసూళ్ళు మాత్రం వస్తూనే వున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్.. ఈ తేడాలేవీ లేకుండా రామ్ చరణ్ సినిమాలకి వసూళ్ళు రావడం కొత్తేమీ కాదు, అది మళ్ళీ వేరే చర్చ.
అసలు విషయమేంటంటే, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, అందులో చూపించిన సోషల్ మెసేజ్.. తెలుగునాట రాజకీయాలపై ముందు ముందు చాలా ప్రభావం చూపబోతోంది. రాజకీయ అవినీతి గురించి సినిమాల్లో ఇంతకు ముందు చూపించలేదా.? అంటే, దానికీ.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని కంటెంట్కీ చాలా తేడా వుంది మరి.! ఈ ఇంపాక్ట్ వేరే లెవల్.
ఓటుకి ఐదొందల నుంచి రెండు వేల దాకా ఇవ్వడం చూస్తుంటాం. తెలంగాణలో ఆ మధ్య జరిగిన ఓ ఉప ఎన్నికలో, జనం 10 వేల రూపాయలు డిమాండ్ చేయడం కూడా చూశాం. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో అయితే, ఏకంగా ఓటుకి 20 వేలు డిమాండ్ చేశారు ఓటర్లు. అధికార పార్టీ, ఓటర్లు అడిగినంతా సమర్పించుకోక తప్పలేదు. ఇంతా చేసినా ఓడిపోయిందాయె.! ఇది జస్ట్ సినిమా మాత్రమే.
రియల్ రాజకీయాల్లో చూసుకుంటే, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసిన రెండు పార్టీలూ అధికారాన్ని చేజార్చుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో. దీన్ని ఓటరు చైతన్యం.. అని నిస్సంకోచంగా అనొచ్చు.
ముందు ముందు ఓటర్లు డిమాండ్ చేసే ‘ఓటుకు నోటు’ వేరే రేంజ్లో వుండబోతోంది. అది రాజకీయ పార్టీలు భరించలేని స్థాయిలో వుంటుందన్నది నిర్వివాదాంశం. అప్పుడిక, డబ్బుతో అవసరం లేని రాజకీయాల్నే మనం చూడాల్సి వస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి, తెలుగు రాష్ట్రాల్లో రచ్చ బండల సాక్షిగా జరుగుతున్న చర్చల్లో ఇదే ముఖ్యమైన అంశం.
