నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవని, కానీ ఈ ఏడాది సంక్రాంతికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా స్వగ్రామాలకు వచ్చి పండగ జరుపుకున్నారని ఆయన పేర్కొన్నారు. జన్మభూమిని ఎవరూ మర్చిపోకూడదని, అదే మన వారసత్వానికి పునాది అని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాలసీలతో చదువుకుని ఉన్నత స్థితికి చేరుకున్నవారు ఉన్నప్పటికీ, ఇంకా చాలామందిలో జీవన ప్రమాణాలు మెరుగుపడలేదని చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా సంపద సృష్టి పెరుగుతుండగా, ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందుందని, కానీ అసమానతలు తగ్గకపోతే నిజమైన సంతృప్తి ఉండదని చెప్పారు. అందుకే పీ4 కార్యక్రమం ద్వారా మార్గదర్శి, బంగారు కుటుంబాల వ్యవస్థను తీసుకువచ్చి పేదరికాన్ని తగ్గించే చర్యలు చేపట్టామని, 10 లక్షల కుటుంబాలను దత్తత తీసుకున్నామని తెలిపారు. 2026లో ఈ కార్యక్రమంపై మరింత ఫోకస్ పెడతామని, డబ్బుతో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అవసరమని చెప్పారు.
తాను మూడు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నానని, భోగి–సంక్రాంతి వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నామని తెలిపారు. సంక్రాంతి రైతుల పండుగ అని, పంటలు ఇంటికి వచ్చి ఆనందంగా గడిపే సమయమని చెప్పారు. రైతులు ఆనందంగా ఉండేందుకు రూ.10 వేల కోట్ల ధాన్యం చెల్లింపులు చేశామని వెల్లడించారు. సంక్రాంతి రోజున పెద్దలను తలచుకుని నివాళులు అర్పించడం మన సంస్కృతి అని, పెద్దలను గుర్తు పెట్టుకోకపోతే వారసత్వం ఉండదని అన్నారు. కనుమ పండుగ సందర్భంగా ప్రకృతిని ఆరాధించడం, పశువులను పూజించడం వంటి సంప్రదాయాల్ని గుర్తు చేశారు.
2047 స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర విజన్ను రూపొందించుకుని 2029, 2039 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం పెరగాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని చెప్పారు. స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి గతేడాది శ్రీకారం చుట్టామని, రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామపురం పంచాయతీలను పైలట్గా తీసుకుని జీవన ప్రమాణాలు, ఆదాయం పెంచే పనులు ప్రారంభించామని వివరించారు.
గ్రామాల అభివృద్ధికి స్పెషల్ ఆఫీసర్ను నియమించి మరుగుదొడ్లు, దీపం, పింఛన్లు అందిస్తున్నామని, ఇల్లు లేని వారిని గుర్తించి ఏడాదిలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పిస్తామని తెలిపారు. ఇంటింటికీ నీటి సరఫరా, రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, రంగంపేటను జాతీయ రహదారితో అనుసంధానం చేస్తామని చెప్పారు. చెత్తను వంద శాతం సేకరించి శాగ్రిగేషన్ చేసి, తడి చెత్త నుంచి కంపోస్ట్, పొడి చెత్తను సర్క్యులర్ ఎకానమీకి పంపుతున్నామని వెల్లడించారు. పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
హంద్రీనీవా నీటిని పైప్లైన్ ద్వారా మూలపల్లి రిజర్వాయర్కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో సంజీవని కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, కుప్పంలో సక్సెస్ కావడంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, ఈ ఏడాదే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, డెయిరీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా యువత నైపుణ్యాలను పెంచుతామని చెప్పారు. అంగన్వాడీ ఆయాలకు కేర్ అండ్ గ్రో కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తామని, రంగంపేట హైస్కూల్, జూనియర్ కాలేజీ కేంద్రంగా విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో తిరుపతి, గ్రామీణ ప్రాంతాల్లో హోం స్టేలను ప్రోత్సహిస్తామని, తిరుపతి రాబోయే రోజుల్లో వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా మారుతుందని చెప్పారు. శెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించామని, తిరుపతి, విశాఖ, అమరావతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో 22ఏ చట్టంతో భూములపై గందరగోళం సృష్టించారని విమర్శించారు. ఏడాది లక్ష్యంతో సర్వే పూర్తి చేసి రూపాయి కూడా తీసుకోకుండా క్యూఆర్ కోడ్తో పట్టాదారు పుస్తకాలు ఇస్తామని, 2027 నాటికి రెవెన్యూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి నెలా 9న పట్టాదారు పుస్తకాలు అందిస్తామని, జాయింట్ కలెక్టర్లు ఈ ఏడాది మొత్తం రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనే పని చేస్తారని స్పష్టం చేశారు.
