గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువగా డోలీలపై ఆధారపడాల్సిన పరిస్థితిని చాలా దగ్గర చూస్తుంటాం. అయితే అక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం ఆ ఊరి ప్రజల వెతలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అసలు రోడ్డు సదుపాయమేలేని ఆ ఊరికి రూ. 2 కోట్లతో రహదారి వేయించింది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధిలోని బింగిడి వలస గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేదు. అత్యవసర సమయాల్లో వారికి డోలీలే శరణ్యం. అయితే గత టీడీపీ ప్రభుత్వం 400 మీటర్ల మేర మట్టి రోడ్డు వేసి నిధుల సమస్య వల్ల వదిలేసింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో పలుమార్లు రోడ్డు సదుపాయం గురించి మొరపెట్టుకున్న ఫలితం లేదు.
బింగిడి వలస గ్రామ ప్రజల కష్టాలని గుర్తించిన కూటమి ప్రభుత్వం దిగువమెంగిడి – బూర్జ ప్రధాన రహదారి నుంచి శిఖరాగ్రం లో ఉన్న బింగిడి వలస గ్రామానికి 1.4 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు వేయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. రెండు కోట్ల నిధులు కేటాయించింది.
ఇటీవలే రోడ్డు పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. బింగిడివలస లాగే శిఖరాగ్రం లో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇంతకీ ఆ ఊరిలో ఉన్న ఇళ్లెన్నో తెలుసా.. అక్షరాల 13. జనాభా కేవలం 55 మంది మాత్రమే.