LuLu Hypermarket పై ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడ్డాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూకట్పల్లి KPHB కాలనీలో ఉన్న ఈ హైపర్మార్కెట్ను అధికారులు తనిఖీ చేయగా, పరిశుభ్రత లోపాలు నుంచి గడువు ముగిసిన ఉత్పత్తుల వరకు అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ఇన్-హౌస్ కిచెన్ విభాగంలో పరిశుభ్రత లేకుండా ఆహార తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫ్రిజ్లలో పాత ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం, వంటశాలలో పురుగుల సంచారం, కుళ్లిపోయిన కూరగాయలు కనిపించడం ఆందోళన కలిగించింది. అలాగే గడువు సమీపంలో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ వస్తువులు, చినిగిన లేదా వినియోగదారులను తప్పుదారి పట్టించే లేబుల్స్తో ఉన్న ఉత్పత్తులు కూడా గుర్తించినట్లు సమాచారం.
రిటైల్ విభాగంలో బేసన్ పిండి, ఆట్టా, పప్పుల్లో పురుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాక్డ్ ఫుడ్ ఉత్పత్తులపై గడువు ముగిసిన FSSAI లైసెన్స్ నంబర్లు ఉండటం, పోషక విలువలు, తయారీదారు చిరునామా, FSSAI వివరాలు లేకపోవడం వంటి లేబులింగ్ లోపాలు బయటపడ్డాయి.
బుచరింగ్ విభాగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. మాంస వ్యర్థాలతో డ్రైన్లు మూసుకుపోవడం వల్ల తీవ్ర దుర్వాసన వ్యాపించిందని, ఇది ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
తనిఖీల సందర్భంగా దాదాపు 150 కిలోల పాడైన లేదా పురుగులతో కలుషితమైన స్వీట్లు, నూనెలు, పిండి, పప్పులను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అదనంగా కల్తీ లేదా అధిక కృత్రిమ రంగుల వినియోగం ఉన్నట్లు అనుమానించిన కొన్ని ఆహార నమూనాలను ప్రయోగశాలకు పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు.
