ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి జరుగుతున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.
అనునిత్యం, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలకి కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికే ప్రభుత్వం నడుపుతున్న కూటమి పార్టీలు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందా.? అంటే, ఔననే చెప్పాల్సి వస్తుందేమో. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఇక్కడ కనిపిస్తున్నది విద్వేషం.
గతంలో, నారాసుర రక్తచరిత్ర.. అంటూ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని చంద్రబాబుపైకి తోసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వచ్చాక, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై ‘కమ్మరావతి’ అంటూ వైసీపీ చేసిన దుష్ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
వైసీపీ అంటేనే అదొక రాజకీయ పార్టీ కాదు, ఫేక్ ఫ్యాక్టరీ.. అనే వాదనకి రోజు రోజుకీ మరింత బలం చేకూరుతోంది. తిరుపతి లడ్డూ కల్తీ విషయమై వివిధ నివేదికలు చెబుతున్న విషయాల్ని తప్పుదోవ పట్టించేలా, అత్యంత నీఛమైన రీతిలో ఫేక్ ప్రచారం చేస్తోంది వైసీపీ.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంపై జరుగుతున్న ఫేక్ ప్రచారం ఇంకో లెవల్ అంతే. డీప్ ఫేక్ ద్వారా, వీడియోల్ని తమక్కావాల్సిన విధంగా మార్ఫింగ్ చేసి, పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది వైసీపీ. ఇంత జరుగుతున్నా, ఈ ఫేక్ ప్రచారాలపై కూటమి ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలకు దిగలేకపోతోందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారిపోయింది.
కేసులు నమోదవుతున్నాయి, కొన్ని ఘటనల్లో అరెస్టులూ జరుగుతున్నాయి. అయితే, చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సులువుగానే తప్పించుకుంటున్నారు ఆయా కేసుల్లో. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి.
మరోపక్క, వైసీపీ దుష్ప్రచారమైతే విచ్చలవిడిగా కొనసాగుతూనే వుంది. ప్రధానంగా తిరుమల చుట్టూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. క్యూ లైన్లలో ఓ మహిళకు పాముకాటు.. అంటూ దుష్ప్రచారం చేయడం.. దాంతో ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.
రెండేళ్ళలోనే కూటమి ప్రభుత్వానికి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది నిర్వివాదాంశం. ఆలస్యం, అమృతం విషం. కేంద్రం, ఇంటర్నెట్ వేదికగా పో..ర్న్.. వీడియోలపై ఉక్కుపాదం మోపినట్లే, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనేమో.!
