AP Politics: వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడి (Chandrababu Naidu) ఇంటిపై వైసీపీ మూకల దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నాటి ఘటనలో ప్రత్యక్ష సాక్షి తమ్మా శంకర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 2021 సెప్టెంబర్ 17న జోగి రమేశ్ తన అనుచరులతో ఈ దాడికి పాల్పడ్డారు.
‘చంద్రబాబును కలిసేందుకు మేము కొందరం ఆయన ఇంటికి వెళ్లాం. 11.30 సమయంలో 5-6 కార్లతో జోగి రమేశ్ తన అనుచరులతో వచ్చారు. పోలీసులు అడ్డుకున్నారు. ఏదో గొడవ జరుగుతుందని వెళ్లిన మమ్మల్నీ కొట్టారు. వీళ్లలో ఒక్కడి తల తీసేసి చంపేస్తే చంద్రబాబు ఇల్లు వదిలి పారిపోతాడు. చంద్రబాబును తరిమేద్దా’మని రమేశ్ బిగ్గరగా అరిచారు.
‘గొడవలొద్దని వారిస్తున్న మమ్మల్ని కొట్టారు. తలపై గాయాలయ్యాయి. నాతోపాటు జంగాల సాంబశివరావు, గాదె శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. పైగా.. నాపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశా’రని వాపోయారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.