డిజిటల్ మీడియా విస్తృతమవుతున్న కొద్దీ సెలబ్రిటీలు దానియొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ దిశగా అడుగులు వేస్తుండగా టాలీవుడ్ లో కూడా ఈ విప్లవం మొదలైంది. ఇప్పటికే సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటిస్తోన్న విషయం తెల్సిందే.
తమన్నా, కాజల్ వంటి వారు కూడా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. సందీప్ కిషన్ ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ మొదటి పార్ట్ లో ఒక పాత్ర పోషించాడు. అమలా పాల్ లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ లో నటించిన విషయం తెల్సిందే.
తాజా సమాచారం ప్రకారం అనుష్క శెట్టి, అక్కినేని నాగ చైతన్యలు కూడా వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వచ్చినట్లు త్వరలోనే షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.
అనుష్క, చైతూలతో పాటు అమలా పాల్ కూడా ఈ వెబ్ సిరీస్ లో నటించనుంది. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ వెబ్ సిరీస్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో ఈ వెబ్ సిరీస్ డబ్ అవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.