సేవ చేస్తామని చెప్పి రూ. కోట్ల విలువైన భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆసుపత్రి కట్టి పేదలకు ఉచిత వైద్య సాయం అందిస్తామని నమ్మబలికి అక్కడ చర్చి మాత్రం కట్టించారు. ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రి ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే విచిత్రమైన కారణం చెబుతున్నారు అదేంటో తెలుసా.. అక్కడ హాస్పిటల్ కట్టడానికి మట్టి స్వభావం సరిగా లేదట. కానీ ఆగమేగాల మీద చర్చి మాత్రం కట్టేశారు.
సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది. క్రిస్టియన్ కమ్యూనిటీ, బీసీ ఎస్సి, ఎస్టీ మహిళల సాధికారత కోసం నర్సింగ్ శిక్షణ ఇస్తామని అందుకు అవసరమైన స్థలం కేటాయించాలంటూ ఆ సంస్థ 2004లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులకు అనుగుణంగా భవనాలు నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమిని కేటాయించాలని, పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామంటూ ఆ సంస్థ అప్పట్లో ప్రభుత్వానికి నివేదించింది. 2006 లో ఆ సంస్థ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే 2009 ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 లో క్యాబినెట్ తిరస్కరించినప్పటికీ వైయస్ కుటుంబ సభ్యుల జోక్యం ఉండటంతో సెయింట్ లూక్స్ కి విలువైన భూమిని దారాదత్తం చేశారు.
ఆ మిషనరీ సంస్థకు 7.5 ఎకరాలు కేటాయించగా అందులో రోడ్డు విస్తరణ కు పోగా 6 ఎకరాలకు పైగా భూమి ఆ సంస్థ అధీనంలో ఉంది. ఇందులో కొంత భాగం నర్సింగ్ శిక్షణ కోసం మూడు రేకుల షెడ్డులు నిర్మించి మమ అనిపించేశారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద ఓ చర్చిని నిర్మించారు. ఏపీ మాజీ సీఎం జగన్ మేనత్త వైయస్ విమల రెడ్డి అక్కడికి వచ్చి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సాగర తీరానికి చేరువలో సముద్రానికి అభిముఖంగా స్థలం ఇవ్వాలని కోరడం, ఇప్పటికీ అక్కడ ఆసుపత్రి నిర్మించకపోవడంతో విలువైన భూమిని దక్కించుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ 300 కోట్లకు పై మాటే మరి ఆసుపత్రికి కట్టడానికి అనువుగా లేని స్థలంలో చర్చి ఎలా కట్టారో వైఎస్ విమలా రెడ్డికే తెలియాలి.