టాలీవుడ్లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్ బాబు సినిమాల వరుస వ్యాపార పరిణామాల్లో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘దూకుడు’ సమయంలో 14 రీల్స్ కొంత మొత్తాన్ని ఫైనాన్స్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘1 నేనొక్కడినే’కు ఎరోస్ ఫైనాన్స్ చేసిందిగానీ, ఆ సినిమా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. దీనివల్ల 14 రీల్స్.. ఎరోస్కు పెద్ద మొత్తం బాకీ పడింది.
ఈ పరిస్థితుల్లో ‘దూకుడు’ విజయంతో ఏర్పడిన క్రేజ్ను నమ్ముకుని రెండు సంస్థలు కలిసి ‘ఆగడు’ చిత్రాన్ని విడుదల చేశాయి. కానీ అదే ఏడాదిలో ఆ సినిమా కూడా భారీ నిరాశను మిగిల్చింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 14 రీల్స్ను ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు మహేష్ బాబు వ్యక్తిగతంగా ముందుకొచ్చి సహకరించారు. ఎరోస్కు ఇచ్చిన మాట ప్రకారం, ‘శ్రీమంతుడు’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు వారికి ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, 14 రీల్స్ బాకీలు పూర్తిగా క్లియర్ చేయలేకపోయింది.
దీంతో 2015 నుంచి 2019 వరకూ బాకీ తీర్చేందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరింది. ఎరోస్ నాలుగేళ్లు వేచి చూసినా, 14 రీల్స్ వాగ్దానం నెరవేర్చలేదు. ఫలితంగా 2019 జూలై నుంచి పెండింగ్ మొత్తంపై 14% వార్షిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ మొత్తం భారీగా పెరిగిపోయింది.
అంతలో ‘సర్కారు వారి పాట’ను ఆపే అవకాశం ఎరోస్కు లేకపోయింది, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్లో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంగా ఉండగా, మహేష్ ఇప్పటికే 2015లో వారిని సపోర్ట్ చేశారు.
ఇప్పుడు ‘అఖండ 2’ ఈ పెద్ద బాకీ మొత్తాన్ని రికవరీ చేసుకునే కీలక అవకాశంగా ఎరోస్ కు దొరికిందని పరిశ్రమ చర్చ. దాంతో ఎరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించి.. తమ బాకీ తీర్చే వరకూ అఖండ 2 .. విడుదల కాకుండా స్టే తెచ్చుకుంది..
ఈ మొత్తం వ్యవహారం మళ్లీ బయటకు రావడంతో టాలీవుడ్లో ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ మధ్య ఉన్న సంబంధాలపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి.
