తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల భాగంగా నిర్వహించిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ బలోపేతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఒక విశ్వవిద్యాలయంలాంటిదని, పార్టీ ఇచ్చిన అవకాశాలు, గుర్తింపు, గౌరవం అన్నీ గుర్తుంచుకుని నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో పనిచేసిన ఎన్నో మంది నేటి రాష్ట్ర నాయకులుగా ఎదిగారని గుర్తుచేస్తూ, అందరూ అదే దారిలో ముందుకు సాగాలన్నారు.
పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో తప్పకుండా భాగస్వామ్యం కావాలని లోకేష్ స్పష్టం చేశారు. చిన్న సమస్యలు సహజమని, అలకలు వద్దని, ఏ విషయం ఉన్నా సంబంధిత నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలతో అనుబంధం పెంచుకోవడం అత్యంత ముఖ్యం అని, తమ ప్రాంత ప్రజలతో మమేకం అయితే మాత్రమే నిజమైన నాయకత్వం నిలుస్తుందని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన అణచివేతలను ప్రస్తావిస్తూ, టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేశారు. సైకో పాలనతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని అందరూ ఒకే దారిలో కష్టపడాలన్నారు.
ప్రతి నాయకుడు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో కలిసి పని చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. అహంకారం దూరంగా ఉంచి, ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ స్పష్టంగా వివరించాలని, దేశంలో ఎక్కడా లేనంతగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. చేస్తోన్న పనిని గర్వంగా చెప్పాలని, ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు ‘మై టీడీపీ’ యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయాలని సూచించారు.
లోకేష్ మాట్లాడుతూ, నాయకులు జీవితాంతం నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి, కష్టపడి పనిచేశాకే నిజమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడం వల్లే నేటి స్థాయికి చేరుకున్నానని, అదే మార్గంలో అందరూ కృషి చేయాలని సూచించారు. శిక్షణా తరగతుల తొలి రోజున రాష్ట్రవ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు అశోక్, శిరీషలతో పాటు పలువురు నాయకులు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణంపై నేతలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల నాయకులు తమ అభిప్రాయాలను లోకేష్కి తెలుపగా, ఆయన కార్యక్రమం ముగింపులో ఆలోచనాత్మక సూచనలు చేశారు.


