పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. సీఎస్ సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో స్టీరింగ్ కమిటీ సభ్యులు జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు సమ్మె నోటీసు అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్ కమిటీగా ఏర్పడినట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పీఆర్సీ జీవోలు జారీ చేశారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని, నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు.. నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరారు.