దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఈ వైరస్ కు గురి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. విచిత్రం ఏంటంటే కరోనా వైరస్ గురించి ఎవరైతే ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని చెప్పారే వారే కరోనా వైరస్ బారిన పడటం విస్తుగొలుపుతోంది.
తెలుగు సినిమా స్టార్ డైరక్టర్ తేజ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు కరోనా పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయారు. టీమ్ కు, తేజ్ కుటుంబసభ్యలకు మాత్రం నెగటివ్ వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.
ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబం ఈ వైరస్ బారిన పడ్డారు. అభిషేక్ బచ్చన్ మినహా అందరూ కోలుకుని ఇంటికి వెళ్లారు. టాలీవుడ్ లో రాజమౌళి కుటుంబం కరోనాకు ఎఫెక్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు తేజ కూడా వైరస్ కు గురి కావడంతో టాలీవుడ్ లో మరింత ఆందోళన చెలరేగుతోంది. దీంతో ఇప్పట్లో మరెవరూ షూటింగ్స్ కు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. సరిగ్గా నెల క్రితం తేజ కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ వీడియో రిలీజ్ చేయడం విశేషం.