తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది?. పాలకవర్గానికి అధికారులకు మధ్య సమన్వయం ఎందుకు లోపించింది?. సాక్షాత్తు సీఎం ఎదుటే టీటీడీ చైర్మన్, ఈవో పరస్పరం వాదులాటకు దిగేంత పరిస్థితి ఎందుకొచ్చింది?. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారిద్దరిపై అసహనం వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు తలెత్తింది? ఈనెల 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు ఈ ఘటనపై ఆరా తీశారు. ఎక్కడ తప్పు జరిగిందనే అంశంపై విశ్లేషించారు. ఇందులో భాగంగా టీటీడీ పాలకవర్గం, ఈవో ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో చైర్మన్ ఈవో ఇద్దరూ సంయమనం కోల్పోయారు. సీఎం ఎదుటే వాదులాటకు దిగారు.
చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి తనను చిన్నచూపు చూస్తున్నారని, తనకేమీ చెప్పడం లేదని బీఆర్ నాయుడు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ కు చెప్పకుండా ఏమీ జరగడం లేదంటూ ఈవో శ్యామల రావు ఘాటుగా బదులిచ్చారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్ల గురించి తనకేమీ చెప్పలేదని చైర్మన్ అన్నారు. దీనిపై స్పందించిన ఈవో.. శ్రీవాణి ట్రస్ట్ బోర్డ్ విషయంలో తమ జోక్యం లేకుండా చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని సీఎం కి ఫిర్యాదు చేశారు. ఇలా ఇద్దరూ వాగ్వాదం చేసుకుంటుండగా సీఎం జోక్యం చేసుకొని వారిపై ఆగ్రహించారు. ఇద్దరూ సమన్వయంతో పనిచేయాల్సిందేనని ఆదేశించారు.
ఆధిపత్య ధోరణే కారణమా?
టీటీడీ లో ఎవరి ఆధిపత్యం వాళ్ళు చూపించుకోవాలన్న అత్యుత్సాహమే సమన్వయ లోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి 15 సార్లు సమావేశాలు జరిగాయి. ఇందులో ఈవో, చైర్మన్ కలిసి ఒకేసారి సమావేశంలో పాల్గొన్నారు. ఇకపోతే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి నిర్ణయాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈఓ, చైర్మన్ కాకుండా అంతా తానే అన్నట్లు వెంకయ్య చౌదరి వ్యవహార శైలి ఉందని టీటీడీ లో పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగుల విషయంలో ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారని కొందరు అంటున్నారు. ప్రక్షాళన పేరుతో ఉద్యోగులను బదిలీ చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆదేశాలను పాటించని ఉద్యోగుల పై చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చాలామంది ఉద్యోగులు సెలవు పై వెళ్ళిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పాలకవర్గం కూడా ఏర్పాటై ఉంటే వారికి అధికారులకు అంత గ్యాప్ ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
