టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు. సిట్ వెల్లడించిన వివరాల ప్రకారం విజయవాడకు సుమారు 12.5 కోట్ల రూపాయలు, చెన్నైకు 7.5 కోట్ల రూపాయలు చేరినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసే కొందరి వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకునే ‘బందరు బియ్యపు దొంగలు’ నీతులు చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ‘బందరు ఊసరవెల్లి’ చెప్పిన వెంటనే తాను రాత్రికి రాత్రే వైష్ణవి డెయిరీ గేట్లకు రంగులు వేసానని చెప్పడం కూడా అసత్యమని పేర్కొన్నారు. వెబ్సైట్లు డౌన్ చేయడం, మార్ఫింగ్ చేయడం వంటి చర్యలు వైసిపి రాజకీయాల్లో కనిపించే ఫేక్ విధానాలని విమర్శించారు.
రాజధాని అంశంలో గతంలో చేసిన ఆరోపణల సమయంలోనే ఏమీ చేయలేరని చెప్పానని, ఇప్పటికీ అదే చెబుతున్నానని ధూళిపాళ్ల అన్నారు. గతంలో తనను 33 రోజుల పాటు జైలులో ఉంచి సంగం డెయిరీ సర్వర్లను హ్యాక్ చేయాలని ప్రయత్నించారని చెప్పారు. అయితే అణువణువూ పరిశీలించినా ఎలాంటి తప్పు బయటపడలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వాల కాలంలో కూడా తాను ఎప్పుడూ భయపడలేదని అన్నారు.
వైసిపి అధికారంలో ఉన్న సమయంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్కు సుమారు 307 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే భారతీ సిమెంట్స్ నుంచి కాంట్రాక్టర్ల ద్వారా మూడు లక్షల టన్నులకుపైగా సిమెంట్ కొనుగోలు చేశారని అన్నారు. వైసిపి ప్రభుత్వం తనపై పెట్టిన 22 కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ప్రభుత్వం సహకరిస్తే ఆ తప్పుడు కేసులను ఎత్తివేయాలి కదా, అని ప్రశ్నించారు.
వైష్ణవి డెయిరీ పక్కన సంగం డెయిరీ ఎంబ్లమ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే తనపై కుట్ర చేసి కేసులు పెట్టించిన మాజీ చైర్మన్ను అడగాలని ధూళిపాళ్ల పేర్కొన్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత వైష్ణవి డెయిరీ కార్యకలాపాలను నిలిపివేశానని చెప్పారు.
తిరుపతి లడ్డూ కల్తీ అంశం నిజమని, నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ మరియు జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB నివేదికలో వెల్లడైందని తెలిపారు. ఈ విషయంలో బాధ్యులైన వారు ఇప్పటికైనా దేవుడి ముందు వెళ్లి తప్పు ఒప్పుకోవాలని సూచించారు. మార్కెట్లో వెన్న ధర సుమారు 360 రూపాయలు ఉంటే 316 రూపాయలకు నెయ్యి ఎలా సరఫరా చేశారని ఆయన ప్రశ్నించారు. పాలు, వెన్న లేకుండా నెయ్యి తయారు చేసినవారు వైసిపి నాయకులేనని విమర్శించారు.
సంగం డెయిరీ 2020, 2021 సంవత్సరాల్లో కూడా టీటీడీ నెయ్యి టెండర్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తిరుమలలో సేవ చేసే అవకాశం కోసం సంగం డెయిరీ ఎదురుచూస్తోందని చెప్పారు. అన్ని నిబంధనలు, సాంకేతిక పరీక్షలు పూర్తి అయిన తర్వాతే సంగం డెయిరీ టెండర్లో పాల్గొని నెయ్యి సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. హెరిటేజ్ డెయిరీ మాత్రం టీటీడీకి ఒక్క నెయ్యి కూడా సరఫరా చేయలేదని పేర్కొన్నారు.
సంగం డెయిరీ గుంటూరు రైతుల సంస్థ అని, శ్రీజ డెయిరీ చిత్తూరు మహిళలతో నడుస్తున్న సంస్థ అని ధూళిపాళ్ల తెలిపారు. వైసిపి చేసిన తప్పును దాచేందుకు ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని దగ్గర తప్పు చేసినవారు తప్పించుకోలేరని హెచ్చరించారు.
దక్షిణ భారతదేశంలో అమూల్ తర్వాత నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించగల సంస్థ సంగం డెయిరీనే అని ఆయన సవాల్ విసిరారు. రైతుల ఆధారంగా నడుస్తున్న ఈ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు.
