ముంబయిలో జరిగిన ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా – 2026’ సదస్సులో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలే దేశాన్ని బలంగా తయారుచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. నైతికత, విలువలు లేకుండా జరిగే అభివృద్ధికి అర్థం లేదన్నారు. వృద్ధిరేటు, పెట్టుబడులు మాత్రమే కాకుండా తదుపరి తరం విద్య దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఎలాంటి ఒత్తిడి లేకపోయినా సవాళ్లను స్వాగతిస్తామని చెప్పారు. అమరావతి భవిష్యత్తు నగరమని, ఇప్పుడు పెట్టుబడులు పెట్టని పారిశ్రామికవేత్తలు తర్వాత పశ్చాత్తాపపడతారని వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణం వేగంగా సాగుతోందని, ప్రతి వంద రోజులకు ఒకసారి వచ్చి చూడాలని సూచించారు.
రాజధాని నిర్మాణం అంటే కేవలం ఒక నగరం కాదని, ఎకనామిక్ క్లస్టర్ల నిర్మాణమని లోకేష్ వివరించారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి రంగాల్లో వర్టికల్, హారిజంటల్ అభివృద్ధి ద్వారా సంపూర్ణ ఎకోసిస్టమ్ను సృష్టించడమే లక్ష్యమన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ సిద్ధాంతంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
డేటా సెంటర్ పాలసీ ద్వారా దేశానికి ఉపయోగపడే ఫ్రేమ్వర్క్ రూపొందించామని లోకేష్ చెప్పారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేశాయని, ప్రస్తుతం అది లాభాల్లో నడుస్తోందన్నారు. పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడానికి అనుభవజ్ఞుడైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రధాన కారణాలని చెప్పారు.
ప్రధాన కంపెనీలకు ఎకరాకు 99 పైసలకే భూమి ఇస్తున్నామన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, భూమి విలువకంటే కంపెనీలు తెచ్చే ఎకోసిస్టమ్ రాష్ట్రానికి ఎంతో పెద్ద ప్రయోజనం కలిగిస్తుందని లోకేష్ తెలిపారు. కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెడుతున్నాయని, వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల కోసం ప్రత్యేక విధానాలు రూపొందించామని చెప్పారు.
ఎఐ సదస్సుల సందర్భంగా దేశ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదని లోకేష్ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ వేదికలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. ట్రేడ్ వార్ సమయంలో కొత్త మార్కెట్లను అన్వేషించి రైతులకు మద్దతు ఇచ్చామని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా మార్కెట్లకు మార్గాలు తెరిచామని వివరించారు.
తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై కఠిన చర్యలు తప్పవని లోకేష్ స్పష్టం చేశారు. 2019-24 మధ్య జరిగిన కల్తీపై విచారణ కొనసాగుతోందని, ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. తిరుమలలో ప్రపంచ స్థాయి టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
రెడ్ బుక్ విషయంలో మాట్లాడుతూ గతంలో తప్పుడు కేసులు పెట్టిన వారి పేర్లు అందులో ఉంటాయని, జగన్ పేరు ఉందో లేదో త్వరలో వెల్లడవుతుందని వ్యాఖ్యానించారు. చిన్నారులకు సోషల్ మీడియాపై కఠిన నియంత్రణ అవసరమని, 11 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని అన్నారు. వయస్సుకు తగిన కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా ఫ్రేమ్వర్క్ రూపొందిస్తున్నామని, 90 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు.
