దేశ రాజధాని ఢిల్లీలో ‘నిరసనలు’ ఆందోళనకంగా మారుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు జమ్మూకాశ్మీర్లో ఇలాంటి పరిస్థితులు చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి దేశ రాజధానిలో కన్పిస్తుండడం.. పరిస్థితి తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వున్నప్పటికీ, ఆందోళనలు జరగడంపై కేంద్ర హోంశాఖ సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతోంది.
కాగా, ఓ పథకం ప్రకారమే ఢిల్లీలో అలజడి సృష్టిస్తున్నాయి కొన్ని అల్లరి మూకలు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్సిఆర్లకు వ్యతిరేకంగా తొలుత నిరసనలు జరిగాయి. ఆ నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పుడు దేశంలో అలజడిని సృష్టించేందుకు.. ఈ ఆందోళనల్ని కొన్ని అల్లరి మూకలు అవకాశంగా తీసుకుంటున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ అల్లర్లపై జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. ‘ఇస్లామిక్ టెర్రరిస్టులు’, ‘హిందూ టెర్రరిస్టులు’ అంటూ ఎవరికి వారు తమ తమ శౖలిలో వీడియోలు తయారు చేస్తూ, మార్పిÛంగ్ ఫొటోలు ప్రచారం చేస్తూ.. ఉద్రిక్త పరిస్థితుల్ని మరింత పెంచేస్తున్నారు. క్రమక్రమంగా ఈ పైత్యం ఇతర రాష్ట్రాలకూ పాకుతోంది.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, బీజేపీకి వ్యతిరేకంగా నినదిస్తున్న విషయం విదితమే. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ముందు ముందు గందరగోళంగా తయారవుతాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. గత కొంతకాలంగా తీవ్రవాద కార్యకలాపాలు దేశంలో పెద్దగా కన్పించలేదు. కానీ, తీవ్రవాదం కొత్త పంథా ఎంచుకుని, దేశంలో అలజడి సృష్టిస్తోందనీ, ఆ తీవ్రవాదం ప్రేరేపితమే.. ఈ అల్లరి మూకల దాడులనే వాదనలూ లేకపోలేదు.
ఏదిఏమైనా, దేశం మనది. అన్ని మతాలకు చెందినవారూ ఇప్పుడు సంయమనం పాటించాల్సిందే. నిరసనల పేరుతో దేశాన్ని తగలబెట్టేయాలని చూడటమంటే అంతకన్నా నరరూపరాక్షసత్వం ఇంకోటి వుండదు. నిరసనలకూ హద్దు వుంటుంది.! ఆ హద్దులకు లోబడే నిరసనలుండాలి.