తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇప్పటికే కష్టకాలంలో ఉందని, ఇటువంటి సమయంలో వేతనాల పెంపు విషయాన్ని ప్రస్తావించడం పరిశ్రమకు మరింత భారమని తెలుగు ఫిలిం చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.
గౌరవనీయులైన కార్మిక శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సామరస్యపూర్వక చర్చలు జరుగుతున్నప్పటికీ, ఫెడరేషన్ వారు ఆ మార్గదర్శకత్వాన్ని పక్కన పెట్టి 30% వేతనాల పెంపు అమలు చేస్తామని, నిర్మాతల నుండి కన్ఫర్మేషన్ లెటర్ తీసుకున్నవారికి మాత్రమే షూటింగ్కు అనుమతి ఉంటుందన్న నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది నిజాయితీతో జరుగుతున్న చర్చల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చిన్న నిర్మాతలు ఈ పెంపును భరించే స్థితిలో లేరని దామోదర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కనీస వేతనాల చట్టం ప్రకారం నిర్మాతలు తమకు సాధ్యమైన వేతనంతో కార్మికులను నియమించుకునే హక్కు కలిగి ఉన్నారని కార్మిక శాఖ కమిషనర్ ఇప్పటికే తెలియజేశారని గుర్తుచేశారు. అదనంగా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్మాతల స్వయంప్రతిపత్తిని సమర్థిస్తూ, ఫెడరేషన్ విధానాలను వ్యతిరేకించినట్లు తెలిపారు.
హైదరాబాద్లో జీవన వ్యయం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నా, మన పరిశ్రమలో కార్మికులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని ఆయన వివరించారు. అయితే యూనియన్లు కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే నైపుణ్యవంతులైన యువకులను లక్షల రూపాయల సభ్యత్వ రుసుము విధిస్తూ అడ్డుకుంటున్నాయని, ఇది ప్రతిభావంతులైన కార్మికులకు అన్యాయం అవుతుందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు దామోదర్ ప్రసాద్ తెలిపారు. నైపుణ్యం ఉన్న ఎవరైనా కార్మికులు, యూనియన్ సభ్యత్వం ఉన్నా లేకపోయినా, సరైన వేతనానికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే నిర్మాతలు వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడం పరిశ్రమ బలోపేతానికి దోహదం చేస్తుందని అన్నారు.
సినిమా పరిశ్రమలో నిర్మాతలే మూలాధారం అని గుర్తుచేస్తూ, వారి శ్రేయస్సే పరిశ్రమకు ప్రాణమని దామోదర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తించి పరిశ్రమ మేలుకోసం సహకరించాలని ఆయన కోరారు.


