సాధారణంగా చికెన్, మటన్ అని చెప్పి బీఫ్ కలిపిన బిర్యానీలను అమ్మడం అందరికీ తెలుసు. కానీ తమిళనాడులో హోటల్ నిర్వాహకులు అంతకుమించి నాలుగాకులు ఎక్కువే చదివారు. అందుకే బీఫ్ కంటే చౌకగా ఏమి వస్తుందా అని ఆలోచించి కాకులను, పిల్లులను నమ్ముకున్నారు. చికెన్ బదులు కాకి మాంసాన్ని, మటన్ అని పిల్లి మాంసాన్ని బిర్యానీలో కలిపి అమ్మేస్తున్నారు.
ఇదేమీ తెలియని సామాన్య జనం అవే లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆహర తనిఖీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టి చాలాచోట్ల కాకి మాంసాన్ని, చంపడానికి సిద్ధంగా ఉంచిన పిల్లులను స్వాధీనం చేసుకున్నారు. 2016లోనే ఈ దందా వెలుగు చూడటంతో జనాలు అవాక్కయ్యారు.
అప్పట్లో రోడ్డు పక్కన ఉంటే హోటళ్లపై జరిపిన దాడులతో ఈ విషయాలు వెలుగు చూశాయి. దీంతో అప్పటి నుంచి కాకి మాంసంపై నిషేధం విధించారు. తాజాగా రామేశ్వరంలో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. అక్కడి ఆలయానికి వచ్చిన కాకులు స్పృహ కోల్పోతున్నాయి. దీంతో భక్తుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు నిఘా పెట్టగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
ఆ కాకులకు గింజలు వేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. మద్యంలో ముంచిన బియ్యం గింజలను ఆ కాకులకు వేస్తున్నానని, దీంతో వాటిని తిన్నకాకులు స్పృహ కోల్పోతున్నాయని చెప్పాడు. అనంతరం వాటిని రోడ్డు పక్కన ఉన్న హోటళ్లకు విక్రయిస్తున్నట్టు వెల్లడించాడు. అసలే కరోనా వైరస్ వణికిస్తున్న తరుణంలో బయటి ఆహారం తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది.