Ramayana: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా బడ్జెట్ ఏకంగా 4000కోట్లని తెలుస్తోంది. రావణుడిగా కన్నడ నటుడు యశ్ నటిస్తూండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడీ సినిమాలో మరో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా రామాయణలో భాగమైందని గతంలో వార్తలు వచ్చాయి.
ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు కాజల్. రావణాసురిడి భార్య మండోదరి పాత్రలో తాను నటిస్తున్నట్టు తెలిపారు. ఓ అవార్డు వేడుకకు హాజరైన కాజల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇటువంటి అతిపెద్ద ప్రాజెక్టులో భాగం కావడం తనకెంతో సంతోషంగా ఉందని.. తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని అన్నారు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. సినిమాలో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూనే సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
భారీగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ కోసం తమ టీమ్ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని టీమ్ వెల్లడించింది. భారతీయులందరి మనసుల్లో ఉన్న రామాయణం ఇతిహాసాన్ని మరింత కొత్తగా, సరికొత్త టెక్నాలజీతో తెరకెక్కించి అందిస్తామని అంటోంది. దీని కోసం ఎంతో అన్వేషించి మరీ తెరకెక్కిస్తున్నట్టు పేర్కొంది. ‘రామాయణ’ తొలి భాగం ఏడాది దీపావళికి తీసుకొస్తూండగా.. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
