వామపక్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో అడ్రస్ గల్లంతయ్యింది. తెలంగాణలో అప్పుడప్పుడూ, ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, ‘ఏదో మూలన నేనున్నా’ అనిపించుకునే వామపక్షాలు, ఆంధ్ర ప్రదేశ్లో అయితే పూర్తిగా మాయమైపోయాయి.
గతంలో, అంటే 2019 ఎన్నికల సమయంలో జనసేనతో జతకట్టిందో వామపక్షం. అప్పట్లో, పవన్ కళ్యాణ్ కారణంగా కాస్తో కూస్తో వామపక్ష భావజాలం గురించి జనం పట్టించుకున్నారేమో. ఇప్పుడైతే,అసలు వామపక్షాలకు ఏపీలో అడ్రస్సే లేదు. రామకృష్ణ అనే ఒకాయన, వామపక్ష భావ జాలంతో అప్పుడప్పుడూ మీడియా ముందుకొచ్చి హడావిడి చేయడం చూశాం.
ఇదే రామకృష్ణ గతంలో, పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి చాలా చాలా గొప్పగా చెప్పాడు. ఇప్పుడేమో, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ‘సనాతని’గా మారిపోయాడంటూ రామకృష్ణ తాజాగా మీడియా ముందుకొచ్చి సెటైర్లు వేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.
సరే, రాజకీయమన్నాక విమర్శలు మామూలే. కాకపోతే, ఈ రాజకీయ విమర్శల్లోకి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవాను ఎందుకు లాగినట్టు రామకృష్ణా.? పవన్ కళ్యాణ్ – అన్నా లెజినెవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యాడు.
ఆ ప్రమాదం నుంచి కోలుకున్న దరిమిలా, తనయుడి క్షేమం కాంక్షిస్తూ కలియుగ ప్త్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న అన్నా లెజినెవా, మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వెళ్ళారు, తలనీలాలు కూడా సమర్పించారు. రష్యన్ మహిళ.. అందునా, క్రిస్టియన్ అయిన అన్నా లెజినెవా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అంతటి భక్తిని నమ్మకాన్ని ప్రదర్శించడం చాలా చాలా గొప్ప విషయంగానే చూడాలి.
పవన్ కళ్యాణ్ చెబితే, ఆమె తిరుమలకు వెళ్ళారనీ, తలనీలాలు సమర్పించారనీ రామకృష్ణ చేసిన తేలిక వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, రామకృష్ణ లాంటోళ్ళకి ఎందుకంత ఒళ్ళు మండిపోతోందిట.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్గా తయారైందిప్పుడు.
