ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది.? సమస్త మానవాళి అంతమైపోతుంది. ఇప్పుడు యుద్ధాలంటే కూర్చున్న చోటే శవాల దిబ్బగా మారిపోవాల్సి వస్తుంది మనుషులంతా. అణ్వాయుధాలతో జరిగే యుద్ధం ఇలాగే వుంటుంది మరి.! కానీ, కరోనా వైరస్ అంతకన్నా పెద్ద ప్రమాదాన్నే ప్రపంచానికి తీసుకొచ్చిందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
కరోనా వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అనూహ్యంగా పెరిగిపోతుండడం ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్న తీరు చూస్తే.. ప్రపంచ దేశాలు గజగజ వణకకుండా వుంటాయా.? చైనాలో పుట్టిన ఈ వైరస్, ఇప్పుడు ప్రపంచానికి పెను శాపంగా మారింది.
చైనాలో వైరస్ వెలుగు చూసిన వెంటనే, ఆ దేశ సరిహద్దుల్ని మూసేసి వుంటే, పరిస్థితి ఇంకోలా వుండేదేమో. అగ్ర రాజ్యం అమెరికా కూడా ఈ విషయంలో పెద్ద తప్పే చేసింది. ‘మాకు వైరస్తో ముప్పు లేదు..’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఆ మాటకొస్తే, ప్రపంచంలో అన్ని దేశాలూ కరోనా వైరస్ విషయంలో అలసత్వం ప్రదర్శించాయి. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.
అయితే, వున్నపళంగా దేశాల సరిహద్దులు మూసేయడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.. ఇప్పుడు తప్పెవరిది.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, ప్రపంచమంతా ఒక్క తాటిపైకొచ్చి, కరోనా వైరస్ మీద యుద్ధం చేయాల్సి వుంది.
కంటికి కనిపించని ఓ వైరస్ మీద.. కోట్లాది మంది చేయాల్సిన యుద్ధమిది. మానవాళి ఎన్నో వైరస్లని చూసింది.. కరోనా వైరస్ కూడా అలాంటిదే. ఖచ్చితంగా విజయం సాధించగలం కరోనా వైరస్ మీద. కానీ, ఆ విజయం ఆలస్యమయ్యే కొద్దీ.. మానవాళికి కనీ వినీ ఎరుగని స్థాయిలో నష్టం జరుగుతుందన్నది నిర్వివాదాంశం. అందుకే, కరోనా వైరస్తో పోరాటాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.