కరోనా విలయం దేశంలోని వ్యవస్థలన్నింటిపై పడింది. ఇందులో దేవస్థానాలు మినహాయింపు కాలేదు. కరోనా విస్తృతి దృష్ట్యా లాక్ డౌన్ లో భాగంగా దేవాలయాలు మూసివేశారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత దేవాలయాలు తెరిచారు. ఇందులో తిరుమల కూడా ఉంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తక్కువమంది భక్తులకు స్వామి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. ఇప్పుడు దేవాలయంలో స్వామివారికి పూజలు, కైంకర్యాలు చేసే అర్చకుడికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయనతో పాటు నలుగరు సన్నాయి వాయిద్యకారులు, ఐదుగురు సెక్యూరిటీ గార్డులకు కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే వీరందరినీ ఆస్పత్రులకు తరలించారు. వీరి కుటుంబసభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు.
కరోనా నేపథ్యంలో టీటీడీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. టోకెన్ విధానం ప్రవేశపెట్టి అతి తక్కువమంది భక్తులు వచ్చేలా విధానాలు రూపొందించింది. క్యూలైన్లలో కూడా మార్కింగ్ చేసింది. అలిపిరి వద్దే భక్తులను ధర్మల్ స్కానింగ్ చేస్తోంది. అయినా టీటీడీలోని వారికి కరోనా సోకడం విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రంలో తిరుమలకు భక్త కోటి ఎలా వస్తారో తెలిసిన విషయమే. రోజుకు 80వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు.