కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా చదువులు చెట్టెక్కేశాయి. చదవాలా.? వద్దా.? అన్న సంశయంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది విద్యార్థులకి. రెండు విద్యా సంవత్సరాలు దారుణంగా దెబ్బతినేశాయి. పదో తరగతి ఫౌండేషన్.. ఇంటర్మీడియట్ అత్యంత కీలకం.. వాటికే సమస్యలు తప్పడంలేదు. డిగ్రీ, ఆపైన చదువులూ తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డాయి.
ప్రభుత్వాలు చేస్తోన్న ఆలోచనలూ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పరీక్షలు పెట్టి తీరతాం.. అని కొన్ని ప్రభుత్వాలు.. పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని మరికొన్ని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.. తమ తమ నిర్ణయాల్ని అమలు చేస్తున్నాయి.
పంజాబ్ రాష్ట్రంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ప్రభుత్వ నిర్వాకం అలాగే యూనివర్సిటీ నిర్వాకంతో అయోమయంలో పడిపోయారు. ఆన్లైన్ విధానంలో సెమిస్టర్ల పరీక్షల్ని యూనివర్సిటీ నిర్వహించింది. అయితే, వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో వుంచకుండా, ‘పాస్’ అనిపించేయడంతో, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.
ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్ కింద ఉద్యోగాల్ని మెరిట్ విద్యార్థులకు కల్పించిన ప్రముఖ సంస్థలు, ఇప్పుడు ఆ విద్యార్థులకు సంబంధించి సెమిస్టర్ల మార్కుల వివరాలు లభించకపోవడంతో, ఉద్యోగాల విషయంలో వెనక్కి తగ్గాయి. ‘ఇదిగో, ఇందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వం పరీక్షల్ని నిర్వహించాలనుకుంటోంది..’ అంటూ, గ్రాడ్యుయేట్ల వ్యవహారాన్ని పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో లింకులు పెడుతున్నారు వైసీపీ మద్దతుదారులు.
నిజమే, పరీక్షల నిర్వహణే మంచిది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రాణంతో పోల్చితే.. పరీక్షలు, కెరీర్.. ఇవేవీ ముఖ్యం కాదు కదా.? డిగ్రీ, ఆ పైన పరీక్షలు వేరు.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వేరు. ఫౌండేషన్ బలంగా వుండాలన్నది ఎంత నిజమో.. ఆ ఫౌండేషన్ మానసిక ఒత్తిడి లేకుండా పడాలన్నదీ అంతే ముఖ్యం.
నిజానికి, ఎల్కేజీ చదువుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు వరకు.. విద్యార్థులు కరోనా నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే.. అది ప్రభుత్వాల నిర్లక్ష్యం.. విద్యా సంస్థల పైత్యం వల్లనే.
20600 546552I like this internet site its a master peace ! Glad I detected this on google . 902107