తెలంగాణలో రోజువారీ కరోనా టెస్టుల సంఖ్య 10 వేలకి ఇంకా చేరుకోలేదు. రోజుకి ఐదు వేల టెస్టులు చేయడానికే పరిస్థితులు అనుకూలించడంలేదిక్కడ. కానీ, పొరుగు రాష్ట్రాల్లో 30 వేల మార్క్ కూడా దాటేసింది. ఎందుకిలా.? నిన్నటికి నిన్న 3 వేల లోపే కరోనా టెస్టులు జరిగితే, 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే, ఆంధ్రప్రదేశ్లో నిన్న సుమారు 30 వేల టెస్టులు జరిగితే 800 లోపు పాజిటివ్ కేసులు వెలుగు చూడటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో కరోనా టెస్టులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్ని వినియోగిస్తున్నారు. ఎక్కడన్నా పాజిటివ్ కేసు నమోదైతే, ఆ వెంటనే.. ఆ ప్రాంతంలో ర్యాండమ్ గా పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం, కరోనా టెస్టులు చేయించుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు జనం. ప్రైవేటు ల్యాబ్లు, ఆసుపత్రుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తోంది సాధారణ ప్రజానీకానికి. ప్రభుత్వాసుపత్రుల సంగతి సరే సరి. దానికి తోడు, ప్రైవేటు ల్యాబులు నిబంధనల్ని పాటించడంలేదంటూ ఆయా ల్యాబ్లలో కరోనా టెస్టులను ప్రభుత్వం నిలిపివేయడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.
సీజన్ మారింది.. వర్షాకాలం కావడంతో సాధారణంగానే సాధారణ జలుబు, సీజనల్ వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. వీటిని కరోనాగా భావించి జనం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ‘కరోనా బూచి’ని అడ్డంపెట్టుకుని సామాన్యుల్ని పీల్చి పిప్పి చేసేస్తోన్న వైనం గురించి నిత్యం మీడియాలో చూస్తూనే వున్నాం. కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా హైద్రాబాద్లో పిలవబడ్తోన్న చెస్ట్ హాస్పిటల్లో ఇద్దరు కరోనా బాధితులు.. అత్యంత దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోవడం పెను సంచలనంగా మారిన విషయం విదితమే.
అవసరమైన అన్ని సౌకర్యాలూ అక్కడ వున్నాయని ప్రభుత్వం చెబుతోంటే, ‘మేం చచ్చిపోతున్నాం..’ అంటూ సెల్పీ వీడియోలు తీసుకుని మరీ రోగులు చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అసలు కరోనా లక్షణాలేమిటి.? కరోనా వస్తే ఏం చేయాలి.? పరీక్షలు ఎలా చేయించుకోవాలి.? వంటి విషయాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. అది సరిపోవడంలేదు. కరోనా నుంచి కోలుకున్నవారితో కరోనా గురించి మాట్లాడించడం ద్వారా సాధారణ ప్రజల్లో ‘భయాందోళనలు’ కొంత మేర తగ్గుతాయి. దేశంలో ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు చాలా చాలా తక్కువనే చెప్పాలి. తెలంగాణలో అసలు ఆ పరిస్థితే కన్పించడంలేదు.
పోలీస్ శాఖలో కొందరు కరోనా బారిన పడి కోలుకోగా.. వారు తిరిగి విధుల్లో చేరడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలాంటి కరోనా విజయగాధల పట్ల ప్రచారం చేయగలగాలి. ఇక, అనుమానిత లక్షణాలున్నవారు పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం మొబైల్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెద్దయెత్తున తెలంగాణ ప్రజల నుంచి వస్తోంది. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని చెబుతోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనా టెస్టులు జరగాల్సిన సంఖ్యలో జరగకపోవడంపై పెదవి విప్పాలి.
మొదట్లో కేసీఆర్, తెలంగాణ ప్రజలకు కరోనా విషయంలో ‘భరోసా’గా నిలిచారు. అప్పట్లో ఆయన వీలు చిక్కినప్పుడల్లా మీడియా ముందుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. రాష్ట్రంలో కరోనా వాస్తవ పరిస్థితి ఏంటి.? అన్నదానిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నిటికీ మించి, కరోనా టెస్టుల కోసం ‘క్యూ లైన్లలో’ నిల్చుంటున్నవారు, టెస్టుల్లో నెగెటివ్ వచ్చినా.. ఆ టెస్టుల కోసం వెళ్ళి కరోనా అటించుకుని రావాల్సి వస్తుందేమోనన్న ఆందోళన చెందే పరిస్థితి రాకుండా.. వీలైనంత ఎక్కువగా శాంపిల్స్ కలెక్షన్స్ సెంటర్స్ ఏర్పాటు చేయకపోతే.. సుమారు కోటి మంది జనాభా వున్న హైద్రాబాద్, కరోనా విషయంలో ముంబై, చెన్నయ్, ఢిల్లీ తదితర నగరాల్ని మించిపోయినా ఆశ్చర్యమేమీ వుండకపోవచ్చు.
178015 494188Read more on that Post.Useful information. 858690