Odisha Train Accident: ఒడిశా (Odisha) రైలు ప్రమాద దుర్ఘటన (Train Accident) భారతీయలను తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది. మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల ఆవేదన.. ఆ భీతావాహ ఘటన నుంచి బయటకు రప్పించలేకపోతున్నాయి. ఇంతటి ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసింది మాత్రం కోరమాండల్ (Coromandel) లోకో పైలట్లు.. గుణనిధి మహంతి, ఆయన అసిస్టెంట్ హజారీ బెహరా. వీరిద్దరూ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వీరికి ప్రస్తుతం భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో చికిత్స అందుతోంది.
గుణనిధిని ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారని.. మహంతికి మాత్రం తలకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని సౌత్ ఈస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఆదిత్య చౌధురి మీడియాకు వెల్లడించారు. వీరింకా పూర్తిగా ఆ షాక్ నుంచి తేరుకోలేదని అన్నారు. అయితే.. వీరి గోప్యతకు భంగం కలిగించొద్దని వారి కుటుంబసభ్యులు అభ్యర్ధిస్తున్నారు. వీరు శారీరకంగా, మానసికంగా కోలుకునేలా చేయాలని కోరుతున్నారు. ఘటనకు వీరిని కారకులను చేయొద్దని.. నిబంధనలకు లోబడే రైలు నడిపారని వారు అంటున్నారు.