విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక పురోగతి దిశగా అడుగేస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ కాగ్నిజెంట్, నగరంలో తన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని రేపు ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయగా, వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపస్ను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 21.31 ఎకరాల భూమి కాగ్నిజెంట్కు కేటాయించబడగా, మూడు దశల్లో అత్యాధునిక ప్రమాణాలతో ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధారిత ఐటీ క్యాంపస్ను అభివృద్ధి చేయడానికి సంస్థ ముందుకొచ్చింది.
విశాఖలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి కాగ్నిజెంట్ రూ.1,583 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుండటం ఐటీ రంగంలో విశేష చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి మొత్తం 8,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటం రాష్ట్ర యువతకు పెద్ద ఉపశమనం కానుంది. 2029 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆ దశలోనే 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నారు. అనంతరం మిగిలిన రెండు దశల్లో ఉపాధిని 8 వేల వరకూ విస్తరించనున్నారు.
ప్రస్తుతం శాశ్వత భవనం సిద్ధం కాగానే వరకు రుషికొండ ఐటీ పార్క్ హిల్–2లోని మహతి ఫిన్టెక్ భవనంలో తాత్కాలిక క్యాంపస్ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కొత్త కేంద్రం కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించడంతో, విశాఖను అంతర్జాతీయ టెక్ హబ్గా మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో విశాఖ ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న దానికి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.
