సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ప్రకటించారు. అన్ని వర్గాలకు కలిపి రూ.రూ. 6700కోట్లు బిల్లులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ వర్గాలకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆర్థికశాఖ స్థితిగతులపై చంద్రబాబు నాయుడు పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీపిఎఫ్, సరెండర్ లీవులు, సిపిఎస్ కంట్రిబ్యూషన్ కలిపి మొత్తం రూ. 1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఉద్యోగులకు రూ. 519 కోట్లు జీపిఎఫ్ విడుదల చేయనుఉన్నారు.
పోలీస్ డిపార్టుమెంట్ కు సంబంధించి సరెండర్ లీవులకు గాను రూ.214 కోట్ల విడుదల చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ నిధులతో 54 వేల 900 మంది పోలీసులకు మేలు జరగబోతోంది. వీటితో పాటు రూ. 300 కోట్ల ఒక నెల సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా విడుదల చేశారు. సిఎస్ఎస్ స్కీమ్స్ కు రూ. 627 కోట్లు, టిడిఎస్ చెల్లింపులు రూ. 265 కోట్లు చెల్లించాలిన ఆదేశించారు. వీటితో పాటు ఏపీకి గుండెకాయ లాంటి అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చిన రైతులకు రూ.244 కోట్లు కౌలు చెల్లింపు కింద విడుదల చేశారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు రూ.400 కోట్లు, డ్రగ్స్, మెడిసిన్స్ కోసం రూ.100 కోట్లు చెల్లించారు. అలాగే విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కింద రూ.788 కోట్లు విడుదల చేశారు.
ఈ నిధులతో 6.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరబోతోంది. కాంట్రాక్టర్ల బిల్లులు రూ.10 లక్షల లోపు ఉన్న అన్నింటినీ రిలీజ్ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వీటి కోసం రూ.506 కోట్లు విడుదల చేయాలన్నారు. దీంతో గత ఐదేండ్లుగా ఇబ్బందులు పడుతున్న 26,000 వేల మందికి లబ్ది చేకూరుతోంది. వీటితో ఎంఎస్ఎంఈ కింద రూ. 90 కోట్లు విడుదల చేస్తామన్నారు. దాంతో 651 కంపెనీలతో పాటు 6651 మందికి లబ్ది జరుగుతోంది. దీంతో పాటు విద్యుత్ శాఖ్ డిస్కంలకు రూ. 500 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పెండింగ్ లో ఉన్న నిర్వహణా బిల్లులు రూ.366 కోట్లు కూడా సంక్రాంతి కానుకగా చెల్లించాలన్నారు.
అలాగే పెండింగ్ లో ఉన్న మరి కొన్ని బిల్లులు, బకాయిలు కూడా విడుదల చేస్తామన్నారు. ఇలా అన్ని బిల్లులు కలిపి రూ. 6700 కోట్లు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పూర్తి నిధులు రేపటి నుంచే లబ్దిదారుల అకౌంట్లలో జమ అవుతాయి. సంక్రాంతి సందర్భంగా ఇంతటి భారీ కానుక ఇవ్వడంతో ఆయా లబ్దిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.