ఎన్డీయే కూటమి పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో వుండాలని పదే పదే ఆకాంక్షిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంది. అసలు, పవన్ కళ్యాణ్ ఎందుకు ‘పదిహేనేళ్ళ స్నేహం’ ప్రస్తావన తెస్తున్నారు.?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జన సేన పార్టీతోనూ అలానే భారతీయ జనతా పార్టీతోనూ టీడీపీ స్నేహం, పదిహేనేళ్ళపాటు ఎందుకు కొనసాగాలో తాజాగా వివరణ ఇచ్చారు. అదీ, చాలా స్పష్టంగా. మిత్రుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు అలా అంటున్నారన్నదానిపై చంద్రబాబు తనదైన రీతిలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో, రాజధాని హైద్రాబాద్ అభివృద్ధి కోసం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశామనీ, తొమ్మిదేళ్ళు అధికారంలో వుండటం వల్ల, తమ వ్యూహాల్ని పక్కాగా అమలు చేయడానికి సాధ్యమయ్యిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, పదిహేనేళ్ళపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో వుండాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పుడే, ప్రణాళికలు ఖచ్చితంగా అమలవుతాయని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యల్లో నూటికి నూరుపాళ్ళూ నిజముంది. 2014-19 మధ్యకాలంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని అయ్యింది. అదీ, చంద్రబాబు పట్టుదలతోనే. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, అమరావతిని పూర్తిగా మరుగున పడేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఇదంతా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గమనించడం వల్లే, రాష్ట్రానికి అలాగే రాష్ట్ర రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని గుర్తించడం వల్లే, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా, 11 సీట్లకు పడేశారు 2024 ఎన్నికల్లో.
ఇదిలా వుంటే, 2024 ఎన్నికల సమయంలోనే, ‘టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఐదేళ్ళు కాదు, పదేళ్ళు కాదు.. పదిహేనేళ్ళు అధికారంలో వుండాలి’ అని జన సేన అధినేత పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలకు చెబుతూ వచ్చారు. అదే మాటని ఆయన ఇప్పుడూ చెబుతున్నారు.
చంద్రబాబు సైతం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు. పరస్పర గౌరవంతో, రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి పార్టీలు ముందడుగు వేస్తున్న దరిమిలా, పదిహేనేళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగడం అనేది కష్టమేమీ కాదు. కూటమి పార్టీలో కింది స్థాయి క్యాడర్, సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నా, నారా లోకేష్ లాంటి కూటమి నాయకులు, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకోపక్క, కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం తరఫున చేయాల్సిన సాయమంతా చేస్తూనే వున్నారు.
