చిత్రపురి హౌసింగ్ సొసైటీలో ₹300 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అవినీతికి పాల్పడుతున్నారని, నిజమైన సినీ కార్మికులకు ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. ఫ్లాట్లు బ్లాక్ మార్కెట్లో కోట్లకు అమ్ముతున్నారని ఆరోపిస్తూ, అనిల్ కుమార్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రదర్శనలో పాల్గొన్న చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, మిగిలిన 2.5 ఎకరాల భూమిలో కార్మికులకు సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టకుండా, 1200 నుండి 4400 చదరపు అడుగుల లగ్జరీ ఫ్లాట్లు కట్టి బయటి వారికి అమ్మే యత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈక్రమంలో HMDA, CMO అధికారులతో కుమ్మక్కై అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
వల్లభనేని అనిల్ కుమార్పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్షీట్లు ఉన్నాయని, రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా అవినీతి ఆగలేదని నిరసనకారులు అన్నారు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో అవినీతి మరింత పెరిగిందని విమర్శించారు.
నిరసనకారులు ప్రధానంగా ఈ డిమాండ్లు చేశారు –
20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి.
కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాల నిర్ణయాన్ని రద్దు చేయాలి.
ప్రస్తుత కమిటీని రద్దు చేసి అడ్-హాక్ కమిటీ నియమించాలి.
కొత్త ట్విన్ టవర్స్లో కేవలం సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించాలి.
కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి.
ఈ ధర్నాలో కస్తూరి శ్రీనివాస్, సంకూరి రవీందర్, భద్ర, శివశంకర్ పటేల్, హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.


