తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్ వివాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈరోజు మధ్యాహ్నం చిరంజీవిని కలిసి సింగిల్ స్క్రీన్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, భయాలు, ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించారు.
సమావేశంలో అన్ని అంశాలను శ్రద్ధగా విన్న చిరంజీవి, ఇది ఒక్క సినిమా లేదా ఒక్క వర్గానికి సంబంధించిన సమస్య కాదని, పరిశ్రమలో భాగస్వాములైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ న్యాయం జరిగేలా పరిష్కారం రావాలని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో సమతుల్యత కోసం ఇప్పటికే కొన్ని విధానాలు అమల్లో ఉన్నాయని, వాటిని అందరూ గౌరవించడం అవసరమని తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యున్నత సంస్థ అయిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండటం సముచితమని చిరంజీవి స్పష్టం చేశారు. పర్సెంటేజ్ మోడల్పై ఛాంబర్ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న తర్వాత, దానికి వ్యతిరేకంగా మీడియా ముందు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని ఆయన సూచించారు. ఇలాంటి పరిస్థితులు పరిశ్రమలో ఐక్యత లేదనే భావనను బయటకు పంపవచ్చని పేర్కొన్నారు.
గతంలో ఏర్పాటైన కమిటీల పనితీరు పట్ల సింగిల్ స్క్రీన్ యాజమాన్యాల్లో కొంత అసంతృప్తి, అపనమ్మకం ఉందని కూడా చిరంజీవి అంగీకరించారు. అయితే ఈసారి ఛాంబర్ నియమించిన కమిటీ జూన్ 30లోపు అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, అందరికీ ఆమోదయోగ్యమైన పర్సెంటేజ్ మోడల్పై నివేదిక ఇస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. కమిటీ సకాలంలో బాధ్యతలు పూర్తి చేసేలా తాను కూడా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్ ప్రతినిధులు తమ సమస్యలను ఓపికగా విని, అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జరిగిన చర్చలను తమ అసోసియేషన్ల సభ్యులకు తెలియజేసి, 24 గంటల్లో తమ ఆమోదాన్ని వెల్లడిస్తామని చెప్పారు.
ఈ కీలక సమావేశంలో సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, కే ఎల్ నారాయణ, సునీల్ నారంగ్, భరత్ నారంగ్, శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్, సుదర్శన్ థియేటర్ ప్రొప్రయిటర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
