తెలుగు గడ్డపై సొంతంగా పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన దివంగత ఎన్టీఆర్ తరహాలోనే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని మెగాస్టార్ చిరంజీవి భావించారు. సినిమాల్లో ఆయనకున్న క్రేజ్ ను ఓట్ల రూపంలో మలుచుకుని సీఎం కావాలనుకున్నారు. కానీ మీడియా అండ లేకపోవడం, నమ్మినవారే నట్టేట ముంచడం వంటి సవాలక్ష కారణాలతో కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు.
తర్వాతి పరిణామాలతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి, వారు అందుకు ప్రతిగా వారిచ్చిన రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవితో సంతృప్తి చెంది ఆనక రాజకీయాలనే వదిలేశారు. స్వతహాగా మృదు స్వభావి అయిన చిరంజీవి రాజకీయాల్లో తనకు ఎదురైన భయంకర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇక వాటి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు వైరి పక్షాలకు చెందిన నేతలు ఎన్నో విమర్శలు గుప్పించారు. చిరంజీవి రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఆరోపణలు చేశారు. అయితే, ఇప్పుడిప్పుడే చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండగా చేసిన పనులు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి కూడా అసెంబ్లీ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు పోటీపడి మరీ చెబుతుండటం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లో మెగా టూరిజం సర్క్యూట్ కోసం చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇటీవల వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం చిరంజీవి రూ.వంద కోట్లు విడుదల చేశారని టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తర్వాత అధికార పార్టీ నేత, మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా చిరంజీవి చేసిన అభివృద్ధి పనులు ప్రస్తావించారు. గతంలో భీమిలి అభివృద్ధి కోసం రూ.50 కోట్లు విడుదల చేశారని వివరించారు.
అయితే, చిరంజీవి అలా నిధులు విడుదల చేయించినా.. తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ వాటిని ఖర్చు పెట్టలేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి చేసిందేమీ లేదంటూ విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీడియా అండ లేకపోవడం అన్న ఒకే ఒక్క కారణంగా చిరంజీవి చేసిన పనులు బయటకు రాలేదని, దురదృష్టం ఆయన్ను అలా కూడా వెంటాడిందని సానుభూతి కనబరుస్తున్నారు. ఏది ఏమైనా నిజం నిలకడ మీద తెలియడమంటే ఇదేనని అంటున్నారు.