యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాల్లో ఎంతో రియాల్టీ ఉంటుంది. జనాలు కూడా కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. మంచి చిత్రాలను అందిస్తూ శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. నిర్మాత ఏఎన్ బాలాజీ ఒరేయ్ బామ్మర్ది, మై డియర్ భూతం వంటి చిత్రాలతో ఆడియెన్స్ను మెప్పించారు. ప్రస్తుతం ఈ బ్యానర్ మీద వరుసగా సినిమాలను నిర్మిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు.
ఈ క్రమంలోనే తమ బ్యానర్లో నిర్మిస్తోన్న చెంచల మూవీకి సంబంధించిన టైటిల్ లోగోను విజయ దశమి సందర్భంగా విడుదల చేశారు. ‘చెంచల’ మూవీ కూర్గ్ ప్రాంతంలో పాము చుట్టూ జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చెంచల పాత్రలో ఓ ప్రముఖ కథానాయిక కనిపించబోతోన్నారు.
చెంచల చిత్రానికి జగదీష్ అచార్ దర్శకత్వం వహిస్తుండగా.. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ శెట్టిలు సంగీతాన్ని అందిస్తున్నారు. రామి రెడ్డి కెమెరామెన్గా, వెంకీ ఎడిటర్గా, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా పని చేస్తున్నారు. ఈ సినిమాకు రచన భార్గవరామ్. డి, వనమాలి పాటలు రాస్తుండగా.. చిన్ని ప్రకాష్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఈ సినిమా కథ చంచల పాత్రకు, ఓ పాముకు మధ్య సాగుతుంది. చెంచల కుటుంబం ఎలా హత్యకు గురైంది.. తన గతం ఏంటి? పాముతో తనకున్న సంబంధం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించబోతోన్నట్టు నిర్మాత ఏఎన్ బాలాజీ తెలిపారు.