టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మాట్లాడిన మాటలకుగాను, అతన్ని అరెస్ట్ చేయడం కరెక్టే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా.. ఎవరూ వ్యవహరించకూడదు. మాట పొదుపు అవసరం ఎవరికైనా.
వైఎస్ భారతి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ని పోలీసులు ఆగమేఘాల మీద అరెస్టు చేశారు సరే, నారా బ్రాహ్మణి మీదా.. నారా భువనేశ్వరి మీదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలుే, కార్యకర్తల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.? ఇదిప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది.
టీడీపీ నేతల కుటుంబాల్లోని మహిళలు, చిన్న పిల్లలపైనా, జనసేన నేతలు, వారి ఇళ్ళల్లోని మహిళలు, చిన్న పిల్లలపైనా వైసీపీ నేతలు, కార్యకర్తలు చేసిన, చేస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు.
చేబ్రోలు కిరణ్ అరెస్టుని సమర్థిస్తూనే, వైసీపీకి చెందిన ‘అబ్యూజర్స్’ మీద చర్యలు తీసుకోలేని తమ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. బీజేపీ కార్యకర్తలది కూడా ఇదే పరిస్థితి.
‘వైసీపీకి చెందిన అబ్యూజర్స్ని అరెస్టు చేస్తే, రాష్ట్రంలోని జైళ్ళు సరిపోవు..’ అంటూ, అబ్యూజర్స్ లిస్టుని, ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెడుతున్నారు కూటమి నేతలు, కార్యకర్తలు. పోసాని కృష్ణమురళిని అరెస్టు చేస్తే, ‘అలా ఎలా అరెస్ట్ చేస్తారు.? ప్రశ్నిస్తే నేరమా.?’ అంటూ సాక్షాత్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పోసాని బూతుల్ని ఎండార్స్ చేశారు.
కానీ, కూటమి ప్రభుత్వం అలా బూతులు మాట్లాడే తమ కార్యకర్తల్ని, నేతల్ని ఎండార్స్ చేయలేకపోతోంది. మంచిదే.. కానీ, వైసీపీ అబ్యూజర్స్ని చట్ట ప్రకారం శిక్షించాలి కదా.?