అమరావతిలో జరుగుతున్న 7వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల పురోగతి వంటి అంశాలపై విస్తృత ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 100కు పైగా పథకాలు, ప్రభుత్వ సేవలు, పాలనలో తీసుకొచ్చిన మార్పులను కలెక్టర్లకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు.
సూపర్ సిక్స్ హామీలు ప్రజల్లో విశేష ఆదరణ పొందాయని చంద్రబాబు పేర్కొన్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్లు అందజేశామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం “స్త్రీ శక్తి” ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని, ఇప్పటివరకు మహిళలు 63.61 కోట్ల ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. దివ్యాంగుల కోసం “దివ్యాంగ శక్తి” పథకం ప్రారంభించి 20.51 లక్షల ప్రయాణాలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.
దీపం-2 పథకం కింద నాలుగు కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్ల ద్వారా 9.15 కోట్ల భోజనాలు అందించామని సీఎం వివరించారు. రైతులకు “అన్నదాత సుఖీభవ” ద్వారా మూడు విడతల్లో రూ.8,985 కోట్లు జమ చేశామని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఇప్పటివరకు రూ.63 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు.
మత్స్యకారులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున సాయం అందిస్తున్నామని, ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించి 2.90 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించామని, ఎస్సీ వర్గీకరణను వివాదాలకు తావులేకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మైనారిటీ సంక్షేమానికి రూ.3,670 కోట్లు కేటాయించామని, పాస్టర్లు, ఇమామ్లు, మౌజన్లు, పురోహితులు, నాయీ బ్రాహ్మణులకు గౌరవ వేతనాలు పెంచినట్లు చంద్రబాబు చెప్పారు. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, జూనియర్ లాయర్లకు గౌరవ వేతనం అమలు చేస్తున్నామని వివరించారు.
మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశామని సీఎం తెలిపారు. 10 వేలకుపైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు చెప్పారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కేంద్రం గెజిట్ విడుదల చేయడం చారిత్రాత్మకమన్నారు.
ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని, నాణ్యమైన మద్యం సరఫరా కోసం జే బ్రాండ్స్ రద్దు చేశామని వెల్లడించారు. చెత్త పన్ను రద్దు చేసి 84 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను తొలగించినట్లు తెలిపారు. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంతో ప్రతి నెల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నామని, విజయవాడ-మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం లభించిందన్నారు. హైదరాబాద్-అమరావతి-చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపిందని చెప్పారు. బెంగళూరు-అమరావతి హైవే పనులు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.
పరిశ్రమల రంగంలో కొత్తగా 28 పాలసీలు తీసుకొచ్చామని, దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి వచ్చాయని సీఎం వెల్లడించారు. సీఐఐ సమ్మిట్ ద్వారా రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. విశాఖలో టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమవగా, కాగ్నిజెంట్కు శంకుస్థాపన జరిగిందన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, డయాఫ్రం వాల్ పూర్తి చేశామని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ జులై నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్కు రూ.1.35 లక్షల కోట్లతో శంకుస్థాపన జరిగిందని, రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. శ్రీ సిటీలో ఎల్జీ, క్యారియర్ సంస్థల భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం జూలై నాటికి పూర్తవుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, విద్యుత్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. “మన మిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు అందిస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమం అమలు చేస్తున్నామని, 2 లక్షల కుటుంబాలకు చేయూత అందించామని వెల్లడించారు.
క్రైమ్ రేట్ తగ్గిందని, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం అన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో స్పష్టం చేశారు.
