ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. 2024 నుంచి రాష్ట్రంలో కొత్త ఆశలు చిగురించాయని, తొలి రోజు నుంచే రాష్ట్ర బ్రాండ్ను తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అనుభవం, చిత్తశుద్ధి, సంకల్పం మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మళ్లీ ప్రముఖ కంపెనీలు రావడం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేశామని, దీనికి మంత్రి లోకేష్ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు కీలకంగా మారాయని చంద్రబాబు అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు మొత్తం 25 కొత్త పాలసీలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్లో 11, ఐటీ ఎలక్ట్రానిక్స్లో 9, విద్యుత్ రంగంలో 1, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో 2, యూత్ అడ్వాన్స్మెంట్ మరియు టూరిజంలో 3 పాలసీలను ప్రవేశపెట్టామని తెలిపారు.
ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా పరిశ్రమలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 45 కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతోందని, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇంటికో ఎంట్రప్రెన్యూర్ అనే లక్ష్యంతో లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఇప్పటికే 11,451 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.270 కోట్ల ప్రోత్సాహకాలు అందించామని తెలిపారు.
విశాఖలో నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గేమ్ చేంజర్గా నిలిచిందని చంద్రబాబు చెప్పారు. ఈ సమ్మిట్ ద్వారా 15 రంగాల్లో 613 ఒప్పందాలు కుదిరాయని, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశముందని వెల్లడించారు. దీని ద్వారా 16.13 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా ఉందన్నారు.
గత 20 నెలల్లో 15 సార్లు ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించి 237 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని ముఖ్యమంత్రి వివరించారు. వీటి ద్వారా రూ.9,03,562 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే 72 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టుల ద్వారా సుమారు 8,54,817 ఉద్యోగాలు సృష్టించబడతాయని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం 77,469 మందికి శిక్షణ ఇచ్చామని, వర్క్ ఫ్రమ్ హోం అవకాశాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు వంటి కీలక పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. అలాగే ఎల్జీ, ఐబీఎం, కాగ్నిజెంట్, సిఫీ, బీపీసీఎల్, టాటా పవర్, రెన్యూ పవర్, తాజ్, ఐటీసీ, రిలయన్స్, రేమాండ్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని తెలిపారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 6,28,347 ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు సాకారమయ్యాయని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో 30,607 ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇందులో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులు మరియు కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తయ్యాయని చెప్పారు. ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. జాబ్ ఫెయిర్లు మరియు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా 1,46,627 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. పరిశ్రమల రంగంలో 95,174, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,866, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు సృష్టించబడ్డాయని వివరించారు.
రాష్ట్రాన్ని సమతుల అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రాంతాలవారీగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. 2047 నాటికి విశాఖ ప్రాంతంలో 800 బిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నాన్ని ఐటీ, జీసీసీ మరియు డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేస్తామని, అమరావతిని క్వాంటం సిటీగా తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్ మరియు హార్టికల్చర్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక నోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో రూ.95 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటవుతుందని, రాయలసీమలో స్పేస్ సిటీ మరియు డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
