తెలుగుదేశం పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడమెలాగో తనకు బాగా తెలుసని చెబుతుంటారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదనీ, తిరిగి పుంజుకుంటామనీ చంద్రబాబు పైకి చెబుతున్నప్పటికీ, గతంతో పోల్చితే ఇప్పుడు చంద్రబాబు మాటలపై ఆ పార్టీ నేతల్లో విశ్వసనీయత ఎవరికీ కన్పించడంలేదు. అందుకేనేమో, గెలిచినవాళ్ళు.. ఓడినవాళ్ళూ.. టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే టీడీపీని వీడే దిశగా అడుగులు వేస్తున్న విషయం విదితమే. బీజేపీతోనూ వైఎస్సార్సీపీతోనూ ఏకకాలంలో ఆయన టచ్లో వున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఎమ్మెల్యేలలో దాదాపుగా అందరూ పార్టీని వీడటం ఖాయమన్న గుసగుసలు విన్పిస్తోంటే, సగానికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలో తమతో టచ్లో వున్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం గమనార్హం.
ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు, బీజేపీతో టచ్లోకి వెళ్ళారట. ‘బీజేపీ పెద్దలు మాతో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవం..’ అంటూ సదరు ఎంపీలు చెబుతున్నారంటే, పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘చంద్రబాబుకి చెప్పే నిర్ణయం తీసుకుంటాం’ అని ఓ ఎంపీ చెబుతోంటే, ‘ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదుగానీ.. కార్యకర్తల నుంచి ఒత్తిడి వుంది.. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వుంది’ అని మరో ఎంపీ తన పరిస్థితిని వివరిస్తున్నారు.
మొత్తంగా ఎంపీలందరిదీ ఇదే పరిస్థితి అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎంపీ తనకు అత్యంత సన్నిహితుడైన ఓ మీడియా ప్రతినిథి వద్ద అసలు విషయాన్ని లీకు రూపంలో బయటపెట్టేశారు. ‘బీజేపీలో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇస్తాం..’ అంటూ టీడీపీకి చెందిన ఓ ముఖ్య నేత (రాజ్యసభ సభ్యుడు కూడా)కు బడా ఆఫర్ ఇచ్చిందట బీజేపీ అధిష్టానం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సదరు ఎంపీకి సంబంధించి చాలా వివాదాలు నడుస్తున్నాయి. ఆ వివాదాల్ని తట్టుకోలేక సతమతమవుతున్న సదరు టీడీపీ ముఖ్య నేత, బీజేపీతో కలిసుంటే ఇతరత్రా సమస్యలూ తగ్గుతాయనే భావనలో వున్నారట.
ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అటు రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు టీడీపీని వీడితే చివరికి చంద్రబాబు వెంట మిగిలేదెవరు.? నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ మాత్రమేనేమో. టీడీపీకి మరీ అంతటి దారుణమైన పరిస్థితి వస్తుందా.? అంటే, తెలంగాణలో టీడీపీ పరిస్థితి చూశాక, ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యమేముందని టీడీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు ఆఫ్ ద రికార్డ్గా వ్యాఖ్యానించడంలోనే అన్ని విషయాలూ స్పష్టంగా అర్థమయిపోతున్నాయ్.
మరి, సంక్షోభంలోంచి అవకాశాల్ని వెతుక్కోవడంలో సిద్దహస్తుడినని చెప్పుకునే చంద్రబాబు నిజంగానే అంతటి సమర్థుడా? సమర్థుడైతే తెలంగాణలో పార్టీని ఎందుకు బాగు చేసుకోలేకపోయారు.? చివరికి ఏమీ చేయలేక ఆంధ్రప్రదేశ్లోనూ టీడీపీ జెండా పీకేసి.. బీజేపీలోనో, కాంగ్రెస్లోనో చంద్రబాబు కూడా కలిసిపోతారేమో!
