ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి విజయవాడ నుంచి బయల్దేరనున్న ఆయన బృందం ఢిల్లీ మీదుగా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు చేరుకుని అక్కడి నుంచి దావోస్కు వెళ్లనుంది. జనవరి 19 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో సీఎం పాల్గొని ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించనున్నారు.
జ్యూరిచ్ చేరుకున్న వెంటనే స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపకులు కిషోర్ లుల్లా, రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్లతో సమావేశం జరుగుతుంది. అదే రోజు భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో సీఎం పాల్గొని 20 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన దావోస్కు చేరుకుంటారు.
దావోస్లో తొలి రోజు యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో పాటు పలు దేశాల ప్రతినిధులతో సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో కీలక భేటీలు జరగనున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ మీడియా సంస్థ పొలిటికోకు సీఎం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.
రెండో రోజు ఇండియా అట్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా ‘జియోగ్రఫీ ఆఫ్ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్’ అంశంపై నిర్వహించే బ్రేక్ఫాస్ట్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఆ తర్వాత ఇండియా లాంజ్ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్లతో కీలక చర్చలు జరుపుతారు. వన్ ఫ్యామిలీ – వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో పాల్గొని ఏపీ పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా సీఎన్బీసీ ఇంటర్నేషనల్కు ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇవ్వనున్నారు.
దావోస్ కాంగ్రెస్ సెంటర్లో జరిగే వివిధ సెషన్లలో సీఎం పాల్గొంటూ ఎనర్జీ ట్రాన్సిషన్, ఇన్నోవేషన్, మౌలిక వసతులు, పరిశ్రమల అభివృద్ధి అంశాలపై ప్రసంగిస్తారు. వరల్డ్ ఇంటెలెక్ట్యువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, స్విట్జర్లాండ్ ప్రభుత్వ పెద్దలు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రితో పాటు అనేక దేశాల ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎన్విడియా, మోలర్ మేర్స్క్, జేఎస్డబ్ల్యూ గ్రూప్, జాన్ కాక్రిల్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలతోనూ చర్చలు జరగనున్నాయి.
మూడో రోజు ప్రపంచ ఆర్థిక వేదికలో నిర్వహించే ప్రధాన సెషన్లలో పాల్గొని ఏపీ పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై తన దృష్టిని వివరించనున్నారు. మొత్తం పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 36 కార్యక్రమాల్లో పాల్గొననుండగా, 16 వన్ టు వన్ సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, పలు ప్లీనరీ సెషన్లలో పాల్గొననున్నారు.
జనవరి 22న దావోస్ నుంచి జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్కు బయల్దేరనున్న సీఎం, జనవరి 23 ఉదయం హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
