ఎన్నికల ఫలితాల విడుదలకు ఎంతో దూరం లేదు. అసెంబ్లీకి ఎన్నికలు జరగడమంటే, అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం తాలూకు పదవీ కాలం ముగిసినట్లే. నలభయ్యేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు ఎన్నికల కోడ్ అంటే ఏంటో తెలియకుండా ఉంటుందా.? ఆయన ఎంతలా బుకాయించినా, ఇప్పుడాయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ‘ఈ దాహం తీరనిదీ..’ అన్నట్లుగా ఇంకా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిపై ఆశ వదులుకోవడం లేదు. నిజానికి వదులుకోవల్సిన అవసరం లేదు. ఏమో అదృష్టం కలిసి వచ్చి ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవ్వచ్చేమో.
కానీ, ఫలితాలు వచ్చే వరకూ కొంచెం హుందాతనం ప్రదర్శించాలి కదా. అదే కనిపించడం లేదు చంద్రబాబులో. సమీక్షలంటారు.. అధికారుల మీద మండిపడతారు. ఇది సంధి కాలం. అధికారుల్లో, ప్రజల్లో సానుకూలత సంపాదించడం ద్వారా వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి చంద్రబాబుకు ఇది అద్భుతమైన అవకాశం. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో పోల్చుకోవడం, దేశ ప్రధాని నరేంద్రమోడీతో పోల్చుకోవడం చంద్రబాబుకు తగని పని. వాళ్లు సమీక్షలు చేస్తున్నారు కాబట్టి, తానూ చేస్తానంటున్న చంద్రబాబు తన సీనియారిటీకి, తానే మచ్చ తెచ్చుకుంటున్నారు.
లోక్సభ ఎన్నికల కోసమే తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కోడ్ని పాఠించాల్సి వస్తోంది. ఇంకో నాలుగున్నరేళ్లకి పైనే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారు. కేసీఆర్ ఎదుర్కొంటున్నవి అసెంబ్లీ ఎన్నికలు కావు. కాబట్టి, ఆయన సమీక్షలు జరపాల్సిందే. ప్రధాన నరేంద్రమోడీ విషయానికొస్తే, దేశ భద్రత సహా, అనేక కీలక అంశాలు అత్యంత ముఖ్యమైనవి కనుక ప్రధాని హోదాలో ఆయన కూడా సమ్షీలు చేయక తప్పనిసరి పరిస్థితి. కానీ చంద్రబాబుకు అలా కాదు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఈ దశలో సమీక్షలు నిర్వహిస్తానని అత్యుత్సాహం చూపడం హాస్యాస్పదమే.
మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రసహనం, ఆయన రాజకీయ జీవితానికే మాయని మచ్చ. ఎందుకంటే, అధికారులెవరూ ముఖ్యమంతిని గౌరవించడం లేదు. ఆ గౌరవాన్ని పదే పదే చంద్రబాబు అడుక్కోవల్సి వస్తోంది. ఇంతవరకూ ఛీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలవలేదు. మర్యాదపూర్వంగా అయినా, చంద్రబాబును కలవాల్సిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం ప్రవర్తన కూడా కొంత అభ్యంతరకరంగానే ఉందనీ, రాజకీయ పండితులు అభిప్రాయ పడుతు9న్నారు.
వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారనీ, అందుకే అధికారులెవరూ చంద్రబాబును లెక్క చేయడం లేదనీ ఇంకో అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమైతే, అధికారులు కూడా తప్పిదానికి పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి మాత్రమే కాదు, చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్. ఆయనకు అధికారులు గౌరవం ఇచ్చి తీరాల్సిందే. అదే సమయంలో చంద్రబాబు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. సమీక్షల పేరుతో అత్యుత్సాహం అస్సలేమాత్రం తగదు. తాజాగా పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చంద్రబాబు వెళితే, అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో క్యాబినెట్ మీటింగ్ కూడా పెడతానంటున్నారు. అర్ధం పర్ధం లేని ఇలాంటి చర్యలతో రోజు రోజుకూ చంద్రబాబు తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారు.
