అమరావతి: ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరు అందించాలన్న ఆలోచన ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదని, దశాబ్దాల క్రితమే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వెలిగొండ ప్రాజెక్టు రూపకల్పనకు ఇంజినీర్ కుడితపూడి శ్రీరామకృష్ణయ్యను నియమించగా, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో 1989లో ప్రాజెక్టు రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. 1996 మార్చి 5న ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, 1999లో తొలి దశ పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చామని తెలిపారు. 2014 నుంచి 2019 మధ్యలో పనులను వేగవంతం చేసి మొదటి సొరంగం దాదాపు పూర్తి చేశామని, ఆ కాలంలోనే రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టినట్టు వివరించారు.
2019 నుంచి 2024 మధ్యలో ప్రాజెక్టు పనులు తీవ్రంగా నిలిచిపోయాయని విమర్శించారు. పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. టన్నెల్లలో తవ్విన మట్టిని తరలించకపోవడం, బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కాలువ పనులు పెండింగ్లో ఉంచడం, పునరావాసం ఇవ్వకపోవడం వంటి లోపాలను ప్రస్తావించారు. టన్నెల్–2లో బోరింగ్ యంత్రం పాడై ఇరుక్కుపోయి ఉండటంతో నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన చర్య ప్రజల విశ్వాసానికి దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించామని ముఖ్యమంత్రి చెప్పారు. 20 నెలల్లో పెండింగ్ బిల్లుల కింద రూ.140 కోట్లు చెల్లించామని, రూ.585 కోట్ల పనులు తక్షణమే చేపట్టామని తెలిపారు. టన్నెల్ సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల కంటే ఈ కాలంలోనే ఎక్కువ మేర బెంచింగ్ పూర్తి చేశామని వెల్లడించారు. హెడ్ రెగ్యులేటర్కు సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని, మార్చి నాటికి నీటి నిల్వకు వీలయ్యేలా మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్స్ పనులను రూ.456 కోట్లతో చేపడుతున్నామని, జూన్ నాటికి వేలాది కుటుంబాలకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే నల్లమల సాగర్లో భారీగా నీటి నిల్వ సాధ్యమవుతుందని, దశలవారీగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. భూగర్భ జలాలు ప్రస్తుతం లోతుల్లో ఉన్నాయని, ప్రాజెక్టు పూర్తయితే జలమట్టం గణనీయంగా పైకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నీటి కొరత తగ్గితే వ్యవసాయం నిలకడగా సాగుతుందని, పరిశ్రమలు రావడానికి కూడా మార్గం సుగమమవుతుందని వివరించారు.
మార్చి 5తో ప్రాజెక్టు భూమిపూజకు 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది జూన్ నాటికి వెలిగొండ స్టేజ్–1 పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 2027–28 నాటికి స్టేజ్–2 పనులు కూడా పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వెలిగొండ ద్వారా మార్కాపురం ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతామని పేర్కొంటూ, ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పరిశ్రమల అభివృద్ధికీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
