అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బాబాయ్ హత్యలాంటి ఘోరమైన ఘటననే చిన్న విషయంగా తీసుకున్న వాళ్లు, తిరుమల పరకామణి సమస్యపై నైతికత గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. రూ.70 వేల చోరీ కేసును రూ.14 కోట్లు ఇచ్చి సెటిల్ చేసేందుకు సిద్ధపడటం, టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో దోపిడీ ఎంత తీవ్రంగా జరిగిందో చెబుతుందన్నారు.
నెల్లూరు, విజయనగరం జిల్లాలు గతంలో ప్రశాంతంగా ఉండేవని, అయితే వైసీపీ కాలంలో నెల్లూరులో ‘లేడీడాన్స్’ వంటి నేరాలు పెరగడం విచారకరమని చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీకి వెళ్లదని, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పరిస్థితులను సమర్థంగా అదుపులో పెట్టామని తెలిపారు.
రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగంగా సాగుతుండగా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని, అయితే ఈ పురోగతిని చూసి కొన్ని రాజకీయ వర్గాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాదులో టీడీపీ పాలనలో ఏర్పడిన మౌలిక సదుపాయాలను నేటి పాలకులే గుర్తిస్తున్నారని, కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలకడం టీడీపీ పాలనా దిశకు నిదర్శనమన్నారు.
లోకేష్ చిన్నతనంలో బిజీ కారణంగా పేరెంట్–టీచర్ మీటింగ్కు వెళ్లలేకపోయానని, నిన్న జరిగిన కార్యక్రమం చూసి ఆయన విద్యార్థి దశ గుర్తుకువచ్చిందని చెప్పారు. పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు.
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని, బాబాయి హత్యను సెటిల్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి ఇప్పుడు తిరుమల పరకామణి చోరీని కూడా చిన్నదిగా చూపడం ప్రమాదకరమన్నారు. దొంగతనానికే సమర్థన చేసే వాళ్లకు సమాజంలో ఏ సందేశం ఇస్తున్నారు? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. నేరస్థులను వెనకేసుకొస్తానంటూ చెప్పడమే పెద్ద సమస్యకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
