ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ గోదావరి క్లీన్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక మద్దతు ప్రకటించింది. గోదావరి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రత్యేక బృందాన్ని పంపించి అధ్యయనం నిర్వహించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశం అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అటవీ, పర్యావరణ అంశాలపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ‘అరణ్యారామం’ కామన్ ఫెసిలిటీ సెంటర్కు కేంద్రం అనుమతులు మంజూరు చేసినందుకు భూపేంద్ర యాదవ్కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రంలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ నివారణ కేంద్రం, హనుమాన్ మానిటరింగ్ సెంటర్, ఫారెస్ట్ ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్, స్టేట్ టైగర్ మానిటరింగ్ యూనిట్ వంటి ఆధునిక విభాగాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.
నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 90 బేస్ క్యాంపులను 150కు పెంచేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ చర్యల ద్వారా స్థానిక చెంచు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అటవీ సంరక్షణను మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో అంతరించిపోయిన అడవి దున్నలు (ఇండియన్ గోర్) పునరుద్ధరణ కోసం మధ్యప్రదేశ్ నుంచి 50 అడవి దున్నలను తీసుకురావడానికి కేంద్రం సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అలాగే పులుల జన్యుపరమైన సమతుల్యత కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆరు ఆడ పులులను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల సమస్యను ఎదుర్కొనేందుకు ఒడిశా నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రప్పించేందుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
గ్రీన్ ఇండియా మిషన్లో భాగంగా రాష్ట్ర తీర ప్రాంత రక్షణ కోసం చేపడుతున్న ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ ప్రాజెక్టుకు కూడా కేంద్రం మద్దతు తెలిపింది. తీర ప్రాంతాల్లో మొక్కల పెంపకం, తుపానులు, ఉప్పెనల ప్రభావాన్ని తగ్గించే చర్యలకు అవసరమైన నిధులను మిస్టీ పథకం ద్వారా అందించేందుకు అంగీకరించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
గోదావరి నదిని పరిశుభ్రంగా, కాలుష్య రహితంగా మార్చడమే కాకుండా అటవీ సంపద పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ సమతుల్యత సాధనలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
