జనం పిట్టల్లా రాలిపోవడమంటే ఏంటో కరోనా సెకెండ్ వేవ్ సమయంలో చూశాం. మొదటి వేవ్ విషయానికొస్తే.. అప్పుడూ ప్రాణాలు పోయాయి కరోనా వైరస్ కారణంగా. రెండో వేవ్ మరీ దారుణమైనది. దాదాపుగా దేశంలో ప్రతి ఒక్కరూ తమకు అత్యంత సన్నిహితుల్లోనో, కుటుంబ సభ్యుల్లోనో కనీసం 5 నుంచి 10 మందిని కోల్పోయారు. వీరిలో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోయినవారే ఎక్కువ.
ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక.. ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే.. చాలామంది విగత జీవుల్లా మారిపోయారు. స్మశానాల యెదుట శవాలు క్యూ కట్టడం చూశాం. ఇది కళ్ళ ముందు కనిపించిన వాస్తవం. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న తేడాల్లేవు. దేశమంతా ఇదే పరిస్థితి. కానీ, ఆక్సిజన్ దొరక్క ఎవరూ చనిపోలేదని కేంద్రం అంటోంది.
ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రానికి, రాష్ట్రాలుగానీ.. కేంద్ర పాలిత ప్రాంతాలుగానీ సమాచారం ఇవ్వలేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా సమాధానమిచ్చింది.. అదీ లిఖిత పూర్వకంగా. ఇంతకీ, అసలు దేశంలో కరోనా వైరస్ వుందని కేంద్రం ఒప్పుకుంటోందా లేదా.? కరోనా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని అయినా కేంద్రం అంగీకరిస్తుందా.? లేదా.?
కోవిడ్ వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.. కోట్లాది జీవితాలు రోడ్డున పడిపోయాయి. ఆ లెక్కలేవీ కేంద్రం వద్ద వుండవు. చాలామంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకే ఆక్సిజన్ అందని సమస్య వచ్చిపడింది. కేంద్రం ఇప్పుడెలాంటి కథలు చెబుతున్నా, ఆక్సిజన్ కొరత దేశంలో వున్న మాట వాస్తవం. అందుకే, వివిధ దేశాల నుంచి యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించింది కేంద్రం. రైలు మార్గం, రోడ్డు మార్గం, జల మార్గం, వాయు మార్గం.. ఇలా అన్ని మార్గాల్లోనూ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించాల్సి వచ్చిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు.
నో డౌట్, కేంద్రం కష్టపడింది.. రాష్ట్రాలూ కష్టపడాల్సి వచ్చింది. ప్రజలూ ప్రాణాలు కోల్పోయారు. అసలంటూ రాష్ట్రాలు ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వైనంపై కేంద్రానికి ఎందుకు నివేదికలు ఇవ్వలేదు.? తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్యతోనే చాలామంది ప్రాణాలు కోల్పోయిన ఘటన చూశాం. ఇది రాష్ట్రంలో అతి పెద్ద ఘటన. తెలంగాణలోనూ ఆక్సిజన్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవేవీ కేంద్రం లెక్కల్లోకి వెళ్ళలేదంటే తప్పు ఎక్కడ జరిగినట్లు.?
బాధ్యత లేని ప్రభుత్వాలు.. బాధ్యత లేని వ్యవస్థలు.. వెరసి, ప్రజల ప్రాణాల్ని బలిగొన్నాయన్నప్పటికీ, ఆ బాధ్యతారాహిత్యాన్ని ఒప్పుకునేందుకు పాలకులకు మనసొప్పడంలేదు. మొదటి వేవ్ తీవ్రంగా వున్న సమయంలో లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించి.. దేశంలో రెండో వేవ్ తీవ్రంగా రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. దేశంలో చోటు చేసుకున్న ప్రతి కరోనా మరణానికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నైతిక బాధ్యత వహించాలి.
590043 357355Can you give me some ideas for piece of software writing? 506734