కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ ఎందుకు మీనమేషాల్లెక్కెడుతోంది.? విచారణకు పదే పదే డుమ్మా కొడుతున్నా, వైఎస్ అవినాశ్ రెడ్డి విషయంలో సీబీఐ ఏమీ చేయలేకపోతోంది ఎందుకు.? అవినాశ్ రెడ్డికి మద్దతుగా, సీబీఐకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఎందుకు కర్నూలులో హైడ్రామా సృష్టించాయి.?
అవినాశ్ రెడ్డి విషయంలోనే ఇలా వుంటే, రేపో మాపో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ విచారించాల్సి వస్తే.? అసలు, సీబీఐ ఎందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించాల్సి రావొచ్చు.?
వివరాల్లోకి వెళితే, తాజాగా సీబీఐ.. న్యాయస్థానంలో దాఖలు చేసిన తాజా అపిడవిట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల కంటే ముందే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హత్య విషయం తెలుసన్నది ఆ అఫిడవిట్లో సీబీఐ పేర్కొన్న అంశం.
మరి, ఈ విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీబీఐ విచారించాలి కదా.? ఎందుకు విచారించాలబ్బా.? విషయం తెలిస్తే, విచారించెయ్యడమేనా.? అసలు కథ వేరే వుంది మరి.!
వైఎస్ వివేకానంద రెడ్డి గుండె పోటుతో చనిపోయినట్లు తొలుత ప్రచారం జరిగింది. వైసీపీ సొంత మీడియా సాక్షిలో ఈ మేరకు పెద్దయెత్తున ప్రచారం షురూ అయ్యింది. ఆ సాక్షి మీడియా అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియానే కదా.! దారుణ హత్యని, గుండె పోటుగా ఎలా ప్రచారం చేస్తారట.?
సరే, ఇంతకీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచారణ ఎప్పుడు.? ఇంకా నయ్యం.. అవినాశ్ రెడ్డిని విచారించడానికే సీబీఐ ముప్పు తిప్పలు పడి, మూడు చెరువుల నీళ్ళు తాగాల్సి వస్తోంది. కర్నూలులో చూశాం కదా.? అవినాశ్ రెడ్డిని సీబీఐ టచ్ చేయలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విచారించడానికి సీబీఐ వెళితే, ఇంకేమన్నా వుందా.?