మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిక్కుల్లో పడ్డారు. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు అటవీశాఖ అధికారులు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూములను ఆక్రమించారని అధికారులు చెబుతున్నారు. ఆక్రమించుకున్న భూమిలో చెట్లను ధ్వంసం చేశారని ఎఫ్ ఐఆర్ లో అధికారులు నమోదు చేశారు. ఇందులో రామచంద్రారెడ్డితో పాటు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ కూడా నిందితులుగా ఉన్నారు.
మంగళంపేట అటవీ ప్రాంతంలో 28.19 ఎకరాలు ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ భూమిలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకుని అటవీశాఖ భూములు ఉన్నంత వరకు హద్దు రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వారం రోజుల్లో ఈ హద్దులు ఏర్పాటు చేయడం పూర్తయ్యేలా కనిపిస్తోంది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అటవీభూములను పరిశీలించి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పెద్దిరెడ్డి కుటుంబంపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
